మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. విజయసాయిరెడ్డి టీడీపీకి అమ్ముడుపోయారంటున్న వైసీపీ.. అందుకు ఇవే పక్కా ఆధారాలంటూ ఓ వీడియోను బయటపెట్టింది. ఏపీ మద్యం కుంభకోణంపై సీఐడీ విచారణకు హాజరవ్వడానికి కొన్ని గంటల ముందు విజయసాయిరెడ్డి, టీడీపీ నేతలతో సమావేశమయ్యారని వైసీపీ ఆరోపించింది. తాడేపల్లి పార్క్ విల్లాలోని విల్లా నెం 27కు మార్చి 11వ తేదీ సాయంత్రం 5 గంటల 49 నిమిషాలకు విజయసాయిరెడ్డి వచ్చారని.. అదే విల్లాకు 13 నిమిషాల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నమ్మినబంటు టీడీ జనార్ధన్ వచ్చారంటూ వీడియోను విడుదల చేసింది. విజయసాయిరెడ్డి, టీడీ జనార్ధన్ 45 నిమిషాల పాటు రహస్య మంతనాల జరిపారని.. ఈ కారణంగానే విచారణ ముగిసిన వెంటనే మీడియా ముందు వైయస్ జగన్పై విజయసాయిరెడ్డి విమర్శలు, విషపు వ్యాఖ్యలు చేశారని వైసీపీ ఆరోపించింది.
విజయసాయిరెడ్డి వైయస్ జగన్ నమ్మి, దగ్గర పెట్టుకుని, పార్టీలో క్రియాశీలక పదవులతో పాటు రాజ్యసభకు పంపించి గౌరవిస్తే.. ఇంకా మూడేళ్లు పదవీ కాలం ఉన్నా చంద్రబాబుకు మేలు చేసేందుకు విజయసాయిరెడ్డి రాజీనామా చేశారని ఆరోపించింది. ఇది నమ్మకద్రోహం కాదా ఆంటూ విజయసాయిరెడ్డి గురించి వైఎస్ జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా వైసీపీ పంచుకుంది.
మరోవైపు మార్చి 12వ తేదీన విజయసాయిరెడ్డి సీఐడీ విచారణకు హాజరయ్యారు. విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి.. విచారణ ముగిసిన అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా వైసీపీలో ముఖ్యనేత అయిన వైవీ సుబ్బారెడ్డి తనయుడు వైవీ విక్రాంత్ రెడ్డి లక్ష్యంగా అనేక ఆరోపణలు చేశారు విజయసాయిరెడ్డి. కాకినాడ సీ పోర్టు వాటాల బదిలీ విషయంలో విక్రాంత్ రెడ్డి లక్ష్యంగా ఆరోపణలు చేశారు. మొత్తం ఒప్పందంలో విక్రాంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించారన్న విజయసాయిరెడ్డి.. పోర్టు వాటాల బదిలీ అంశంలో వైఎస్ జగన్కు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. కేవీ రావు, శరత్ చంద్రారెడ్డి, అరబిందో కంపెనీల మధ్య ఒప్పందం కుదరడంలో విక్రాంత్ రెడ్డిదే ముఖ్యపాత్ర ఆని చెప్పుకొచ్చారు.
ఇక ఏపీ మద్యం కుంభకోణం విషయంలో కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రధాన సూత్రధారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. మరోవైపు ఈ కేసులో రాజ్ కెసిరెడ్డి ఏపీ సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయమై ఇటీవల మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. విజయసాయిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయారని వైఎస్ జగన్ ఆరోపించారు. అందుకే మూడున్నర ఏళ్ల పదవీకాలం ఉండగానే.. చంద్రబాబు నాయుడుకు మేలు చేసేందుకు రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారని ఆరోపించారు.
వైసీపీకి సంఖ్యా బలం లేదని తెలిసీ..తన రాజీనామాతో చంద్రబాబుకు, కూటమికి మేలు జరుగుతుందని తెలిసీ, ప్రలోభాలకు లోనై అమ్మేశారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి చేసే వ్యాఖ్యల గురించి ఏం మాట్లాడాలని వైఎస్ జగన్ అన్నారు. అయితే ఇది జరిగిన రెండు రోజుల్లోనే విజయసాయిరెడ్డిపై వైసీపీ వీడియో బయటపెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa