ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నం తిన్న తరవాత చేయకూడని కొన్ని పనులు, అలవాట్లు

Health beauty |  Suryaa Desk  | Published : Sun, May 25, 2025, 10:53 PM

ఏం తింటున్నాం. ఎలా తింటున్నాం. ఈ రెండే మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తాయి. కానీ తిన్న తరవాత కూడా మనం ఏం చేస్తున్నాం అనేది కూడా మన హెల్త్ ని నిర్ణయిస్తుంది. చాలా మంది తిన్న వెంటనే కడుపు నిండా నీళ్లు తాగేస్తారు. ఇంకొందరు వెంటనే వెళ్లి మళ్లీ సీట్ లో కూర్చుని ఆఫీస్ పని మొదలు పెడతారు. ఇవన్నీ మనకి చాలా నార్మల్ గానే అనిపిస్తుండొచ్చు. కానీ..రెగ్యులర్ గా చేయడం వల్ల ఎన్నో అనారోగ్యాలు వస్తాయి. ఈ అలవాట్లతో తెలియకుండానే మనమే ఎన్నో జబ్బులను ఆహ్వానిస్తున్నాం.


తిన్న తరవాత ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని తప్పులు చేయకూడదని వివరించారు డాక్టర్ మనోజ్ఞ. నీళ్లు తాగడంతో పాటు మరి కొన్ని అలవాట్లనూ మానుకోవాలని సూచించారు. తిన్న తరవాత చేయకూడని పనులతో పాటు ఏమేం చేయాలో కూడా చెప్పారు. ఇలా చేయడం వల్ల అజీర్తి, గ్యాస్ తో పాటు మరి కొన్ని సమస్యలు దూరం అవుతాయని వివరించారు. మరి తిన్న తరవాత చేయకూడని పనులేంటి. ఏమేం చేయొచ్చు అన్న వివరాలు తెలుసుకుందాం.


నిద్రపోవడం


సాధారణంగా తిన్న వెంటనే మనకి నిద్ర వచ్చేస్తుంది. కునుకు పాట్లు పడుతుంటాం. ఇది చాలా సహజం. కానీ ఆ సమయంలో నిద్రపోవడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. ఇలా తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. శరీరంలో ఎలాంటి కదలిక లేకుండా రెస్ట్ మోడ్ లో ఉంటే తిన్నదంతా పెట్టెలో పెట్టినట్టే ఉంటుంది. కాస్తైనా కదలికలు ఉంటేనే జీర్ణ వ్యవస్థ యాక్టివ్ గా ఉంటుంది. డైజెస్టివ్ ఎంజైమ్స్ విడుదలై ఆహారం జీర్ణం అవుతుంది. తిన్న వెంటనే నిద్రపోతే ఈ ఎంజైమ్స్ విడుదల కావు. ఫలితంగా తిన్నది గొంతులోకి వచ్చినట్టుగా అవుతుంది. సరిగ్గా జీర్ణం కాక ఇబ్బంది పడాల్సి వస్తుంది.


టీ, కాఫీలు తాగడం 


తిన్న తరవాత టీ లేదా కాఫీ తాగడం అసలు మంచిది కాదు. ఆహారంలో ఉన్న ఐరన్ తో పాటు మరి కొన్ని పోషకాలు శరీరానికి అందకుండా ఇవి అడ్డుకుంటాయి. అంటే తిన్న వెంటనే టీ , కాఫీలు తాగితే న్యూట్రియెంట్స్ కోల్పోతాం. ఈ అలవాటు ఉండి ఉంటే వెంటనే అది మానుకోవడమే మంచిది. ఇక తిన్న తరవాత స్నానం చేయడమూ మంచిది కాదు. తిన్నది అరగాలంటే బాడీలో హీట్ ఉండాలి. హీట్ సరైన విధంగా ఉంటేనే డైజేషన్ కి అవసరమైన యాసిడ్స్ విడుదలవుతాయి. అయితే..ఆ సమయంలో స్నానం చేయడం వల్ల బాడీ టెంపరేచర్ లో మార్పులు వస్తాయి. ఈ కారణంగా వేడి తగ్గిపోయి ఇది డైజేషన్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే తిన్న తరవాత స్నానం చేయకూడదని పెద్దలు చెబుతుంటారు.


నీళ్లు అతిగా తాగడం


తిన్న వెంటనే ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా చేయడం వల్ల పొట్టలో జీర్ణం అయ్యేందుకు వీలుగా విడుదలయ్యే యాసిడ్స్ చల్లారిపోతాయి. ఫలితంగా తిన్న ఆహారం సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. ఇది కడుపు ఉబ్బరం, అజీర్తి, గ్యాస్ లాంటి సమస్యలకు దారి తీస్తుంది. దీంతో పాటు తిన్న తరవాత పొరపాటున కూడా స్మోకింగ్, గుట్కాలు తినడం లాంటివి చేయకూడదని వివరించారు డాక్టర్ మనోజ్ఞ. ఈ అలవాట్లు కూడా జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయని చెప్పారు.


అతిగా వ్యాయామం


చాలా మంది తిన్న వెంటనే కేలరీలు తగ్గించుకోవాలని చెప్పి అతిగా వ్యాయామం చేస్తుంటారు. ఇది కూడా మంచిది కాదు. అయితే..ఓ అరగంట లేదా గంట తరవాత వ్యాయామం చేస్తే బెటర్. తిన్న వెంటనే చేయడం వల్ల జీర్ణ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. విపరీతంగా కడుపు నొప్పి రావడం, అజీర్తి లాంటి సమస్యలు వచ్చే ప్రమాదముంటుంది. అయితే..తిన్న తరవాత కనీసం అరగంట నుంచి మూడు గంటల మధ్యలో ఎప్పుడైనా వ్యాయామం చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.


ఏం చేయొచ్చు


తిన్న తరవాత వెంటనే కూర్చోకుండా కనీసం పది నుంచి పదిహేను నిముషాల పాటు వాకింగ్ చేయాలి. మరీ నెమ్మదిగా కాదు. మరీ వేగంగా కాదు. నార్మల్ స్పీడ్ లో నడిస్తే మంచిది. ఇలా చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. వీటితో పాటు తేలికపాటి పనులు చేసుకోవచ్చు. అన్నం తినే సమయంలో నీళ్లు ఎక్కువగా తాగకూడదు. తరవాత కూడా కనీసం అరగంట గ్యాప్ ఇచ్చి తాగాలి. ఇలా అయితే తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. అజీర్తి సమస్య రానే రాదు. యాసిడ్స్ సరైన విధంగా విడుదలై ఫుడ్ డైజెస్ట్ అవుతుంది. అయితే.. తిన్న తరవాత వాకింగ్ చేయడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa