ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగి ఉన్న కారులో ఒకే కుటుంబానికి చెందిన ఏడు మృతదేహాలు

Crime |  Suryaa Desk  | Published : Tue, May 27, 2025, 07:55 PM

వేకువజాము సమయంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ కారులో ఆరుగురు కుటుంబ సభ్యులు అచేతనంగా పడి ఉన్నారు. దాని పక్కనే ఓ వ్యక్తి కూర్చుని ఉండగా.. ఈ విషయాన్ని పలువురు స్థానికులు గుర్తించారు. వెంటనే అతడి వద్దకు వెళ్లి ఏం జరిగిందని, ఇక్కడెందుకు కూర్చున్నారని ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన అతడు హోటల్ దొరక్క అక్కడ కారు ఆపి అందులో తన కుటుంబ సభ్యులు పడుకున్నారని చెప్పాడు. కానీ వారంతా చాలా సేపటి నుంచి చడీచప్పుడు లేకుండా ఉండకపోయేసరికి స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో అతడిని నిలదీయగా.. వారంతా ఆత్మహత్య చేసుకున్నారని.. మరికాసేపట్లోనే తాను కూడా చనిపోబోతున్నట్లు చెప్పాడు. భయపడిపోయిన స్థానికులు వెంటనే పోలీసులు, అంబులెన్సుకు ఫోన్ చేశారు. ఆపై ఏం జరిగిందంటే..?


డెహ్రాడూన్‌కు చెందిన ఓ కుటుంబం హర్యానాలోని బాగేశ్వర్ బాబాగా ప్రచారం పొందిన ధీరేంద్ర కృష్ణ శాస్త్రి నిర్వహించిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత తమ కారులోనే ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే పంచకుల వద్దకు చేరుకున్న వీరు.. కారును అక్కడ ఆపేశారు. ముఖ్యంగా కారు చాలా సేపు అక్కడే ఉండగా.. ఓ గంట సేపటి తర్వాత అందులోంచి ఓ వ్యక్తి కారు దిగి బయటకు వచ్చాడు. పక్కనే ఉన్న రోడ్డుపై కూర్చున్నాడు. చాలా సేపటి వరకు అతడు అలాగే ఉండగా.. విషయం గుర్తించిన స్థానికులు వారి వద్దకు వెళ్లారు. కారులోకి చూడగా.. అందులో ఆరుగురు అచేతనంగా పడి ఉండడం గమనించారు. పడుకున్నారేమోనని భావించి కారు పక్కన ఉన్న వ్యక్తిని ఇక్కడెందుకు ఆగారాని ప్రశ్నించారు. ఇందుకు అతడు తన పేరు ప్రవీణ్ మిట్టల్ అని.. తమది డెహ్రాడూన్ అని చెప్పాడు.


అలాగే తన కుటుంబం మొత్తం బాగేశ్వర్ ధామ్ వెళ్లామని.. తిరిగి వస్తుంటే ఆలస్యం కావడంతో రాత్రి ఉండడానికి హోటల్ దొరకలేదని చెప్పాడు. అందుకే అక్కడ ఆగినట్లు వివరించారు. అయితే కారులో పడుకున్నారని భావించిన వాళ్లలో ఎలాంటి అలికిడీ లేకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు.. మరి వాళ్లెందుకు అలా ఉన్నారని ప్రశ్నించారు. గట్టిగా నిలదీశారు. దీంతో ప్రవీణ్ మిట్టల్ వారంతా చనిపోయారని చెప్పాడు. ఆత్మహత్య చేసుకున్నారని.. తాను కూడా మరో ఐదు నిమిషాల్లో ప్రాణాలు కోల్పోతున్నట్లు వివరించాడు. అతడు చెప్పిన విషయాలకు భయపడ్డ స్థానికులు వెంటనే పోలీసులు, అంబులెన్సుకు సమాచారం అందించారు.


ఇలా అంబులెన్సు హుటాహుటిన అక్కడకు చేరుకోగా.. ప్రవీణ్ మిట్టల్‌ను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు పోలీసులు ఆగి ఉన్న కారు వద్దకు వెళ్లగా.. అందులో ఆరుగురు చనిపోయి కనిపించారు. దీంతో వారందరినీ కూడా పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలాగే వారి కారులో వెతకగా.. రెండు పేజీల సూసైడ్ నోట్ లభించింది. అందులో ప్రవీణ్ మిట్టల్.. ఆర్థిక సమస్యలు భరించలేకే తమ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వివరించాడు. తమ చావుకు ఎవరూ కారణం కాదని.. తన వల్లే తన కుటుంబ సభ్యులు అంతా చనిపోవాల్సి వస్తుందని రాసుకొచ్చాడు. అలాగే తమ అందరి అంత్యక్రియలు తన మేనమామే చేయాలని అందులో వివరించాడు. అయితే చనిపోయిన ప్రవీణ్ మిట్టల్.. డెహ్రాడూన్‌కు చెందిన వాడని పంచకుల డీసీపీ హిమాద్రి కౌశిక్ తెలిపారు. అలాగే చనిపోయిన వాళ్లలో ప్రవీణ్ మిట్టల్ భార్య, తల్లిదండ్రులు సహా ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నట్లు తాము గుర్తించామన్నారు. వీరంతా విషం తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటారని తాము భావిస్తున్నట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa