ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలోని ఆ రెండు నగరాలకు .. 95 ఎలక్ట్రిక్ బస్సులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 28, 2025, 06:41 PM

రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త బస్సులను కూడా కొనుగోలు చేశారు. ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలనే ఉద్దేశంతో నూతన బస్సుల కొనుగోలుతో పాటుగా ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంపై కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ బస్సుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపింది. ఈ నేపథ్యంలో పీఎం ఈ- బస్‌ సేవా పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి త్వరలోనే ఎలక్ట్రిక్‌ బస్సులు అందించనున్నట్లు తెలిసింది. పీఎం - ఈ బస్ సేవా పథకం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడలలో అమలు చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మచిలీపట్నం, గుడివాడ బస్సు డిపోలకు ఎన్ని బస్సుల అవసరమనే దానిపై అధికారులు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది.


పీఎం - ఈ బస్ సేవా పథకం కింద అభివృద్ధి చెందుతున్న పట్టణాలకు ఎలక్ట్రిక్ బస్సులు అందించనున్నారు. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 750 ఎలక్ట్రికల్ బస్సులు కేటాయించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 3 లక్షల జనాభాపైగా ఉన్న పట్టణాలను ఎంపిక చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 2011 జనాభా లెక్కల వివరాల ప్రకారం మచిలీపట్నం జనాభా 1.80 లక్షలు కాగా.. గుడివాడ జనాభా 1.40 లక్షలుగా ఉంది. రెండింటి జనాభా కలిపి 3 లక్షలకు పైగా ఉండడంతో మచిలీపట్నం, గుడివాడను ఎంపిక చేశారు. ఈ డిపోలకు అవసరమైన ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రతిపాదనలు పంపాలని స్థానిక అధికారులను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న అవసరాలకు అనుగుణంగా మచిలీపట్నం, గుడివాడకు 95 బస్సులు అవసరమని అధికారులు గుర్తించారు. ఆ మేరకు ప్రభుత్వానికి నివేదించారు.


మరోవైపు గతంతో పోల్చితే మచిలీపట్నం బాగా విస్తరించింది. అలాగే మచిలీపట్నం పోర్టు కారణంగా ఈ ప్రాంతానికి మరిన్ని పరిశ్రమలు రానున్నాయి. దీంతో మరింత విస్తరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రోడ్ల విస్తరణ, వసతుల కల్పన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు కార్యాచరణ చేపట్టింది. అటు గుడివాడ కూడా పారిశ్రామికంగా క్రమంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలోనే గుడివాడ, మచిలీపట్నం భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా.. అవసరమైన ఎలక్ట్రిక్ బస్సులను పంపాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ బస్సులు అందుబాటులోకి వస్తే ప్రజారవాణా వ్యవస్థ మెరుగుపడటంతో పాటుగా పర్యావరణానికి మేలు జరుగుతుందని అధికారులు చెప్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa