ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహానాడులోనే కాదు అక్కడ కూడా 3 పూటలా భోజనాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 28, 2025, 06:35 PM

తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు కడపలో ఘనంగా జరుగుతోంది. లక్షల మంది టీడీపీ కార్యకర్తలు, ముఖ్య నేతలు మహానాడులో పాల్గొంటున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణతో పాటుగా పలు కీలక అంశాలపై మహానాడు వేదికగా మేధోమథనం జరగనుంది. కడప గడ్డపై మహానాడు నిర్వహించడం ఇదే తొలిసారి కాగా.. మహానాడులో పాల్గొనేందుకు అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు తరలివెళ్తున్నారు. ఇక కార్యకర్తలు, నేతల కోసం మహానాడులో భోజన ఏర్పాట్లు వహ్వా అనిపిస్తున్నాయి.


మహానాడుకు లక్షల మంది కార్యకర్తలు వస్తున్నా.. వారందరి ఆకలి తీర్చేలా టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకుంది. 20 రకాలకు పైగా వంటకాలతో మహానాడు భోజనాల మెనూ సిద్ధం చేసింది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్.. ఇలా మూడు పూటలా లక్షల మంది కార్యకర్తల ఆకలి తీరుస్తుండటంపై.. మహానాడుకు హాజరైన టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


మరోవైపు మొదటి రోజు 2 లక్షల మంది, ఆఖరి రోజు 5 లక్షల మంది.. మొత్తం మూడు రోజులకు కలిపి 10 లక్షల మందికి భోజనం అందించేలా మహానాడులో భోజన ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో కార్యక్రమం ఏదైనా భోజనాలు పెట్టాలంటే టీడీపీతోనే సాధ్యమంటూ తెలుగు తమ్ముళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహానాడు కార్యక్రమానికి లక్షల మంది జనం తరలి వచ్చినప్పటికీ అందరి ఆకలి తీరేలా ఏర్పాట్లు చేస్తారని.. తమను కార్యకర్తలుగా కాకుండా కుటుంబసభ్యులుగా అధిష్ఠానం భావిస్తుందని.. అందుకే ఖర్చుకు వెనుకాడకుండా భోజన ఏర్పాట్లు చేస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


అయితే మహానాడులో మాత్రమే కాదని.. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లోనూ కార్యకర్తలకు భోజనం ఏర్పాట్లు ఉంటాయని మరికొంతమంది నెటిజన్లు చెప్తున్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో మూడు పూటలా భోజనం ఏర్పాట్లు ఉంటాయని కామెంట్ చేస్తున్నారు. ప్లీనరీ అయినా మహానాడు అయినా లక్షల మందికి కడుపునిండా భోజనాలు పెట్టడం మా పార్టీకి అలవాటేనంటూ తెలుగు తమ్ముళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


మహానాడు వంటకాల మెనూ


మరోవైపు కడప జిల్లాలో జరుగుతున్న మహానాడుకు హాజరయ్యే వారి కోసం ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణ వంటకాలను ఏర్పాటు చేశారు. చాలాకాలం తర్వాత మాంసాహార వంటకాలను కూడా కార్యకర్తల కోసం ఏర్పాటు చేశారు. భోజనాల్లో 20 వంటకాలకు తగ్గకుండా వడ్డి్స్తున్నారు. ఇందుకోసం సుమారు 1,700 మంది వంటవారు, 800 మందిని వడ్డించేవారిని ఏర్పాటు చేశారు. వంటకాలతో పాటుగా చక్కెర పొంగలి, ఫ్రూట్ హల్వా, తాపేశ్వరం కాజా, అల్లూరయ్య మైసూర్ పాక్ వంటి స్వీట్లు కూడా ఏర్పాటు చేశారు.


ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా ఇడ్లీ, పొంగలి, టమాటా బాత్, టూటీఫ్రూటీ కేసరి, కాఫీ, టీలు అందిస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో నాన్ వెజ్ ప్రియుల కోసం గోంగూర చికెన్, ఎగ్ రోస్ట్, ఆంధ్రా స్టైల్‌ చికెన్‌ కర్రీ, రోటి పచ్చడి, అన్నం, బగారా రైస్, ఉలవచారు, సాంబారు, మామిడికాయ పచ్చడి, పెరుగు ఏర్పాటు చేశారు. ఇక శాఖాహారం తినే వారి కోసం ప్లెయిన్ బిర్యానీ, గోంగూర పూల్‌ మఖానా, టమాటా పప్పు, తెల్లన్నం, ములక్కాయ టమాటా, బెండకాయ బూందీ, రోటి పచ్చడి, పెరుగు, చిప్స్ ఏర్పాటు చేశారు. సాయంత్రం స్నాక్స్‌ కింద కాఫీ, టీలతో పాటు బిస్కెట్లు, కార్న్‌ సమోసా, పకోడీ, మిర్చి బజ్జీలు అందిస్తున్నారు. రాత్రి భోజనంలో అన్నం, వంకాయ బఠాణీ, పెసరపప్పు చారు, ఆలూ ఫ్రై, రోటి పచ్చడి, పెరుగు వడ్డిస్తున్నారు. దీంతో కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa