కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. దేశం నలుమూలల నుంచి భక్తులు వెంకన్న దర్శనం కోసం వస్తారు. ఇక పండుగలు, సెలవులు, ప్రత్యేక పర్వదినాల వేళ తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇసుక వేస్తే రాలనంతగా భక్తులు వస్తారు. ప్రస్తుతం స్కూల్, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు వేసవికాలం సెలవులు. దీంతో చాలా మంది కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ఇలానే హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం కూడా బాలాజీ దర్శనం కోసం తిరుపతి వెళ్లగా వారికి ఊహించని షాక్ ఎదురైంది. ఆ వివరాలు..
తిరుపతి వెంకన్న దర్శనం కోసం తిరుమల వెళ్లిన హైదరాబాద్ భక్తులకు భారీ షాక్ తగిలింది. ఓ మహిళ మెడలో బంగారు గొలుసు మాయం అయ్యింది. దీంతో వారు టీటీడీ విజిలెన్స్కు సమాచారం అందించారు. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్, కూకట్పల్లిలోని ప్రగతి నగర్కు చెందిన శ్రీదేవి అనే మహిళ కుటుంబసమేతంగా తాజాగా వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమల వెళ్లారు. అక్కడ విష్ణు నివాసంలోని రూమ్ 613లో దిగారు. ఆ తర్వాత స్వామి వారి దర్శనానికి వెళ్లి వచ్చి.. గదిలో నిద్రపోయారు.
అయితే రాత్రి పడుకుని.. తెల్లారి లేచేసరికి తన మెడలో ఉన్న 16 గ్రాముల గొలుసు మాయం అయ్యింది. గదిలో నిద్రిస్తున్న సమయంలో దొంగతనం జరిగిందని ఆమె తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు తమ ఆభరణాలను చోరీ చేశారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వారు బస చేసిన ప్రదేశంలోని సీసీకెమెరాలను జల్లెడపడుతున్నారు. పవిత్రమైన తిరుమలలో ఈచోరీ ఘటనతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా.. చూడాలని టీటీడీ అధికారులను కోరుతున్నారు భక్తులు.
గతంలో కూడా విష్ణు నివాసంలో ఇలాంటి చోరీ కేసులు వెలుగు చూశాయి. ఇక్కడ బస చేస్తున్న యాత్రికుల ఫోన్లు, లగేజీ దొంగలు దోచుకెళ్లారు. సుమారు 20 ఫోన్ల వరకు దొంగల చేతికి చిక్కాయి. దేవ దేవుడి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు.. విష్ణు నివాసంలో విశ్రాంతి తీసుకుంటుంటారు. భక్తులు అలసిపోయి.. ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు కూడా విష్ణు నివాసంలోనే ఇలా దొంగతనం జరగడం సంచలనంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితులు కోసం గాలిస్తున్నారు. త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa