ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆపరేషన్ సిందూర్ సక్సెస్.. పెళ్లి కుమార్తెలకు సర్కార్ సరికొత్త గిఫ్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 28, 2025, 07:23 PM

ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్‌ చేపట్టి.. పాక్ ప్రభుత్వానికి, సైన్యానికి, అక్కడ ఉంటున్న ఉగ్రవాదులకు భారత్ కోలుకోలేని గట్టి దెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆపరేషన్ సిందూర్ గురించి ప్రపంచ దేశాలకు తెలియజేసేలా దేశంలోని అన్ని పార్టీల నుంచి కొందరు నేతలను ఎంపిక చేసి.. చాలా దేశాలకు పంపించి.. అక్కడ వివరించే ప్రక్రియను ప్రారంభించింది. ఇక దేశంలో కూడా ఆపరేషన్ సిందూర్‌ గురించి ప్రతీ ఒక్కరికి తెలిసేలా చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సూచించారు. ఇందులో భాగంగానే ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ పిలుపు మేరకు.. ఆపరేషన్ సిందూర్ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.


ఇక నుంచి యూపీ రాష్ట్రవ్యాప్తంగా జరిగే సామూహిక వివాహాల్లో వధువులకు సిందూర్‌దాని (సిందూరం డబ్బా)ను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు మద్దతుగా ఉండేందుకు తీసుకువచ్చిన ఈ సామూహిక పెళ్లిళ్ల పథకంలో ఇప్పటివరకు ఒక్కొక్క జంటకు ఇస్తున్న ఆర్థిక సాయాన్ని రూ.51 వేల నుంచి రూ.1 లక్షకు పెంచుతున్నట్లు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ వివాహాల్లో వరకట్నం, బాల్య వివాహాలు ఉండవని.. కులం, మతం, ప్రాంతం వంటి ఆంక్షలు ఏమీ లేవని యూపీ మంత్రి అసీమ్ అరుణ్ స్పష్టం చేశారు.


సనాతన ధర్మంలో సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యత కలిగిన సిందూరం డబ్బాతో పాటు మరికొన్ని ప్రతీకాత్మక బహుమతులను కూడా అందించనున్నారు. 10 అంతకంటే ఎక్కువ జంటలు తాము వివాహాలు చేసుకోవాలని.. ముందుగా నమోదు చేసుకుంటే.. సామూహిక వివాహ వేడుకలకు మద్దతు ఇవ్వడానికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని.. మంత్రి అసీమ్ అరుణ్ చెప్పారు.


అయితే యూపీలో ఈ సిందూర్‌దాని పంపిణీకి సంబంధించిన నిర్ణయం.. ఇటీవల నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించిన తర్వాత వచ్చింది. ఆ సమావేశంలో ఆపరేషన్ సిందూర్ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రధాని మోదీ.. నేతలు అందరికీ సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే యూపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆపరేషన్ సిందూర్ ప్రాముఖ్యతను, విజయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఒక మార్గంగా భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa