ఈ డిజిటల్ యుగంలో యూపీఐ (UPI) లాంటి చెల్లింపులు ఎంతగా విస్తరించినా, ఇప్పటికీ మన రోజువారీ జీవితంలో నగదు వాడకం పూర్తిగా ఆగలేదు. అయితే, మీ దగ్గర అప్పుడప్పుడు కనిపించే చిరిగిన, నలిగిన లేదా పాడైన కరెన్సీ నోట్లు ఏమవుతాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బ్యాంకులు వాటిని తిరిగి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపించాక, ఆర్బీఐ వాటిని ఏం చేస్తుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు! చాలామందికి తెలియని ఈ ఆసక్తికరమైన నిజాలు.. పర్యావరణ పరిరక్షణ పట్ల ఆర్బీఐకి ఉన్న నిబద్ధతను చాటిచెబుతాయి. చాలామంది అనుకున్నట్లుగా ఆర్బీఐ చిరిగిన నోట్లను పారవేయదు. పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా వాటిని రీసైకిల్ చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది.
ఏటా దేశంలో ఇలా పాడైన నోట్ల వల్ల ఏర్పడే స్క్రాప్ (వ్యర్థం) ఏకంగా 15,000 టన్నులకు చేరుకుంటుందని రిజర్వ్ బ్యాంక్ తన 2024-25 వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా చాలా సెంట్రల్ బ్యాంకులు ఈ పాడైన నోట్లను చెత్త కుప్పల్లో వేయడం లేదా ఇంధనంగా వాడటం వంటివి చేస్తుంటాయి. కానీ, ఆర్బీఐ మాత్రం దీనికి భిన్నంగా, పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని వినూత్నంగా వ్యవహరిస్తుంది. ఇలా చేయడం వల్ల ఆ నోట్లను ఎవరూ తిరిగి వాడలేరు. నకిలీ నోట్లు తయారు చేసే ప్రమాదం కూడా ఉండదు.
ఆర్బీఐ వద్ద అధునాతన యంత్రాలు ఉన్నాయి. అవి చిరిగిన నోట్లను సేకరించి, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించేస్తాయి. ఆ తర్వాత, ఈ పేపర్ తుక్కును ఒక ప్రత్యేక ప్రక్రియ ద్వారా చెక్క బోర్డులు (కార్డ్ బోర్డ్స్) తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇంకా కొత్త పేపర్ ఉత్పత్తులు తయారుచేయడానికి.. కొన్నిసార్లు ఎరువులు తయారుచేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఇది నోట్ల వ్యర్థాలను సమర్థంగా వినియోగించుకోవడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు కూడా చేయూతనిస్తుంది.
చిరిగిన నోట్లను రీసైకిల్ చేస్తూనే, మరోవైపు కొత్త నోట్ల ముద్రణ వ్యయం కూడా పెరుగుతోందని ఆర్బీఐ వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్ల ముద్రణకు అయిన ఖర్చు గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 25 శాతం పెరిగి రూ. 6,372.8 కోట్లకు చేరుకుందని ఆర్బీఐ నివేదిక తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 5,101.4 కోట్లుగా ఉంది. 2024-25లో చలామణిలో ఉన్న నోట్ల విలువ, వాటి పరిమాణం కూడా 6 శాతం వరకు పెరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ తన నివేదికలో స్పష్టం చేసింది.
ఇక, డిజిటల్ చెల్లింపుల విషయానికి వస్తే, 15 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న యువత ఎక్కువగా యూపీఐ లావాదేవీలను చేస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. స్మార్ట్ఫోన్ల విస్తృత వినియోగం కారణంగా దాదాపు 99.5 శాతం మంది ప్రజలు యూపీఐ ద్వారా ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలను సులభంగా నిర్వహించగలుగుతున్నారని నివేదికలో వెల్లడైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa