ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంఐటీలో భారతీయ-అమెరికన్ విద్యార్థిని మేఘా వేమూరి సంచలన ప్రసంగం

international |  Suryaa Desk  | Published : Sat, May 31, 2025, 06:24 AM

అమెరికాలోని ప్రతిష్ఠాత్మక మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఓ భారతీయ-అమెరికన్ విద్యార్థిని తన గ్రాడ్యుయేషన్ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపాయి. ఇజ్రాయెల్‌పై విమర్శలను అణచివేయాలని అమెరికా సంస్థలపై ట్రంప్ యంత్రాంగం నుంచి ఒత్తిడి పెరుగుతున్న ప్రస్తుత క్లిష్ట సమయంలో, మేఘా వేమూరి అనే ఈ విద్యార్థిని ఏమాత్రం వెనకాడకుండా ఇజ్రాయెల్ సైన్యంతో ఎంఐటీకి ఉన్న సంబంధాలపై నిప్పులు చెరిగింది. పాలస్తీనాకు గట్టిగా మద్దతు తెలిపింది.గురువారం జరిగిన ఎంఐటీ పట్టభద్రుల కార్యక్రమంలో, సీనియర్ క్లాస్ ప్రెసిడెంట్‌గా ఉన్న మేఘా వేమూరి తన ప్రసంగంలో, "పాలస్తీనాను భూమి పైనుంచి తుడిచివేయాలని ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది. ఇందులో ఎంఐటీ కూడా భాగం కావడం సిగ్గుచేటు" అని తీవ్రంగా విమర్శించింది. కంప్యూటర్ సైన్స్, న్యూరోసైన్స్, లింగ్విస్టిక్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన మేఘా వేమూరి, "మనం ఇప్పుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని మన జీవితాల్లో ముందుకు సాగడానికి సిద్ధమవుతున్నాం. కానీ, గాజాలో ఇప్పుడు ఒక్క యూనివర్సిటీ కూడా మిగల్లేదు" అని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ప్రసంగానికి తోటి విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి.ఎంఐటీపైనే నేరుగా విమర్శలు గుప్పించిన మేఘా వేమూరి, ఇజ్రాయెల్ అతిపెద్ద ఆయుధ తయారీ సంస్థ 'ఎల్బిట్ సిస్టమ్స్'తో ఎంఐటీ భాగస్వామ్యాన్ని విద్యార్థులు ఈ ఏడాది మొదట్లో విజయవంతంగా అడ్డుకున్నారని గుర్తుచేసింది. ఎల్బిట్ సంస్థకు చెందిన డ్రోన్లు, నిఘా వ్యవస్థలను గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో విస్తృతంగా ఉపయోగించారని ఆరోపణలున్నాయి. "ఎంఐటీ పరిశోధనా సంబంధాలు కలిగి ఉన్న ఏకైక విదేశీ సైన్యం ఇజ్రాయెల్ ఆక్రమణ దళాలే. శాస్త్రవేత్తలుగా, ఇంజనీర్లుగా, విద్యావేత్తలుగా, నాయకులుగా ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. సహాయక చర్యలకు మద్దతివ్వండి, ఆయుధ సరఫరాపై నిషేధం విధించాలని పిలుపునివ్వండి, ఎంఐటీ సంబంధాలు తెంచుకోవాలని డిమాండ్ చేస్తూనే ఉండండి" అని పిలుపునిచ్చింది.మేఘా వేమూరి ప్రసంగం అనంతరం మాట్లాడిన ఎంఐటీ ప్రెసిడెంట్ సాలీ కోర్న్‌బ్లూత్, ఆమె విమర్శలను పట్టించుకోలేదు. సంస్థ భావప్రకటనా స్వేచ్ఛకు విలువ ఇస్తుందని చెబుతూనే, "ఈ రోజు కేవలం పట్టభద్రుల గురించి మాత్రమే" అని వ్యాఖ్యానించారు. అయితే, మేఘా వేమూరి విద్యాసంబంధ అంశాలపై కాకుండా రాజకీయ ప్రదర్శన చేశారని కొందరు విమర్శకులు ఆరోపించారు. "పట్టభద్రుల ప్రసంగాలు స్ఫూర్తినివ్వాలి కానీ, విభజించకూడదు. ఇలాంటి సున్నితమైన అంశాన్ని వ్యక్తిగత రాజకీయ వేదికగా మార్చుకోవడం తోటి విద్యార్థులకు అన్యాయం చేయడమే" అని ఒక విమర్శకుడు సోషల్ మీడియాలో రాశారు. ఆమె ప్రసంగం క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.మరోవైపు, చాలామంది మేఘా వేమూరి వ్యాఖ్యలను ధైర్యమైనవిగా, స్ఫూర్తిదాయకమైనవిగా ప్రశంసించారు. "ఆమె ప్రసంగం ఒక భారతీయురాలిగా నన్ను గర్వపడేలా చేసింది! చరిత్రలో సరైన పక్షాన నిలిచారు" అంటూ ఎక్స్ (ట్విట్టర్) లో వందలాది స్పందనలు వెల్లువెత్తాయి. అయితే, కొందరు తీవ్ర విమర్శకులు ఆమె వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయడంతో పాటు, ఆమెకు భవిష్యత్తులో ఉద్యోగం దొరకదని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa