ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లద్దాఖ్‌లో ఉద్యోగాలు ఇక వారికే..: రిజర్వేషన్లపై కేంద్రం కీలక ప్రకటన

national |  Suryaa Desk  | Published : Tue, Jun 03, 2025, 07:21 PM

కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌లో ఉద్యోగాల రిజర్వేషన్లపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. అక్కడి ప్రజల భాష, సంస్కృతి, రాజ్యాంగ పరిరక్షణ కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వారి స్థానికత, రిజర్వేషన్ల అంశంపై అధికారిక ప్రకటన చేసింది కేంద్ర సర్కారు. లద్దాఖ్‌లోని ఉద్యోగాల్లో 85 శాతం స్థానికులకే ఇవ్వాలని కేంద్రంలోని బీజేపీ సర్కారు నిర్ణయించింది. 15 ఏళ్లకు మించి లద్దాఖ్ ప్రాంతంలో నివసిస్తున్నవారు అలాగే కనీసం 7 ఏళ్ల పాటు ఆ ప్రాంతంలో చదువుకుని 10 లేదా 12వ తరగతి పరీక్షలకు హాజరైన వారిని స్థానికులుగా గుర్తించి వారికి ఉద్యోగాల్లో స్థానిక కోటా రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు ప్రకటించింది.


అలాగే లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌లో మూడులో ఒక వంతు సీట్లు స్థానిక మహిళలకే కేటాయించనున్నట్లు పేర్కొంది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని వెల్లడించింది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్-370ని 2019లో రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే జమ్ముకశ్మీర్‌ను రెండు భాగాలుగా ఏర్పాటు చేసింది కేంద్ర సర్కారు. అలా ఒకటి జమ్ముకశ్మీర్, మరొకటి లద్దాఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి.


అయితే ఆర్టికల్ 370 రద్దు చేయడంతో స్థానిక భాష, సంస్కృతిపై దాడి జరుగుతుందని ఆరోపిస్తూ హక్కుల పరిరక్షణ కోసం స్థానికంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికుల ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. లద్దాఖ్ ప్రజల స్థానికత నిర్ధారణకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని కేంద్ర ప్రభుత్వం 2023 జనవరిలో ఏర్పాటు చేసింది.


వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఈ బృందం లద్దాఖ్ ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి ఆమోద యోగ్యమైన పరిష్కారానికి కృషి చేసింది. మరోవైపు ఇవే డిమాండ్లపై పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కూడా అక్టోబర్ 2024లో దిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa