ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుమార్తె, అల్లుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ లేఖ విడుదల చేసిన ముద్రగడ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 09, 2025, 05:40 PM

ఎవరో ఏడుస్తున్నారని రాజకీయాలను వదిలిపెట్టను అంటూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తన కుమార్తె, అల్లుడి కుటుంబంపై ఆయ‌న  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబంపై మరో కుటుంబం కొంత కాలంగా దాడి చేస్తోందని మండిప‌డ్డారు. తనకు కాన్సర్ వచ్చిందని.. తన చిన్న కొడుకు పట్టించుకోవడం లేదని తప్పుడు ప్రేలాపన చేస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. ఆయన కుమారుడి ఎదుగుదలను చూసి కొందరు ఏడుస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన ఆరోగ్యంపై సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలపై మాజీ మంత్రి ముద్రగడ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా ముద్రగడ లేఖను విడుదల చేశారు. లేఖలో ప్రధానంగా అయన వ్రాసింది ఏమిటంటే... ‘మా కుటుంబంపై మరో కుటుంబం కొంతకాలంగా దాడి చేస్తుంది. మా కుటుంబాల మధ్య సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయి. మా అబ్బాయి ఎదుగుదల చూసి కొందరు దారుణంగా ఏడుస్తున్నారు. వారితో మాకు ఏమాత్రం సంబంధం లేదు. నాకు క్యాన్సర్ వచ్చిందని, నా చిన్న కొడుకు పట్టించుకోవడం లేదని తప్పుడు ప్రేలాపన చేస్తున్నారు. నాకు, నా కొడుకుకు మధ్య మనస్పర్థలు పెంచి దూరం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని జన్మలెత్తినా వారి గుమ్మం ఎక్కను.నాకు, నా వియ్యంకుడు శివాజీకి మధ్య మనస్పర్థలు తేవాలని  చూస్తున్నారు. ఇటువంటి కుళ్ళు రాజకీయాలు మానుకోండి. నా కొడుకునే కాదు.. మనవడిని కూడా రాజకీయాల్లోకి తీసుకెళ్తాను. వారిని ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను. నాపై ఎవరో ఏడుస్తున్నారని రాజకీయాలను వదిలిపెట్టను. తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వకండి.. పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు. ఆమె మామగారికి క్యాన్సర్ వస్తే రాజమండ్రి హాస్పిటల్‌లో నేను 15 రోజులు సేవ చేశాను. వీళ్ళు నా మీద ప్రేమ ఒలకబోస్తున్నారు. వయసు రీత్యా నాకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి తప్ప.. మరేవీ లేవు. గతంలో నా భార్యకు క్యాన్సర్ వచ్చినప్పుడు వారింటికి వెళ్తే ఐదు నిమిషాలు కూడా మా వద్దకు రావద్దని కూతురు, అల్లుడు చెప్పారు. వీళ్లా ఈరోజు మాట్లాడేది. వీళ్లతో ఏడాది నుంచి రాకపోకలు ఆగిపోయాయి. ఏం ఆశించి నన్ను టార్గెట్ చేస్తున్నారు. వీరు బెదిరిస్తే బెదిరి పోతానా?. అన్ని కార్యక్రమాలు చేస్తున్నాను. కార్యకర్తలతో కూడా మాట్లాడుతున్నాను.ప్రభుత్వ జీవోలపై ఆ​ కుటుంబం వారు సలహా ఇచ్చామని అంటున్నారు. మీకు అంత దమ్ము, ధైర్యం ఉంటే కాపులను బీసీల్లో కలిపి కార్యక్రమం చేయించండి. సూపర్ సిక్స్ పథకాలు ముఖ్యమంత్రితో అమలు చేయించండి. పథకాలు అమలు చేపించి చూపించండి.. అప్పుడు మీ డబ్బా కొట్టుకోండి. మీ చీప్ పబ్లిసిటీ కోసం ఇంతగా దిగజారి బతకొద్దు. ఎన్ని జన్మలెత్తినా మీకు మాకు సంబంధాలు ఉండవు. అనవసరంగా నా ప్రస్తావన తేవద్దు. సిగ్గు, మర్యాద ఉంటే ఈరోజు నుంచి తప్పుడు ప్రచారం ఆపండి’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa