ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రికి రూ.5 వేలు లంచం ఇస్తూ.. అడ్డంగా దొరికిపోయిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు

national |  Suryaa Desk  | Published : Mon, Jun 09, 2025, 07:06 PM

ప్రభుత్వం నియమించిన ఓ కమిటీలో స్థానం కోరుతూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు విద్యాశాఖ మంత్రికే లంచం ఇవ్వడానికి ప్రయత్నించాడు. ముఖ్యంగా ఓ అభ్యర్థన పత్రం సహా స్వీటు బాక్సు, రూ.5 వేలు ఉన్న కవరును ప్రజలందరి ముందే చేతికి అందించాడు. అది తెలియని మంత్రి ఆ కవరును తీసుకోగా.. అందులో డబ్బు ఉన్నట్లు గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సదరు ఉపాధ్యాయుడిని కస్టడీలోకి తీసుకున్నారు.


మంత్రికి నేరుగా లంచం ఇవ్వడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడో ప్రభుత్వ ఉద్యోగి. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది. ఇప్పుడు ఆ ప్రభుత్వ ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకుని లంచం గురించిన వివరాలను ఆరా తీస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రజల నుంచి నేరుగా వినతులు, ఆర్జీలు స్వీకరించే రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ సోమవారం కూడా ఎప్పట్లాగే ప్రజల నుంచి వినతులు తీసుకోవడం ప్రారంభించారు. తన నివాసానికి వచ్చిన ప్రజలను కలుస్తూ వారి సమస్యలు వింటూ ఆర్జీలు తీసుకున్నారు.


ఆ సమయంలోనే మంత్రి నివాసానికి వచ్చిన చంద్రకాంత్ వైష్ణవ్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. ప్రభుత్వం నియమించిన పాఠ్యాంశాల కమిటీలో తనకు చోటు కల్పించాలని కోరుతూ లిఖితపూర్వక అభ్యర్థనతో అక్కడికి వచ్చాడు. విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్‌కు అభ్యర్థన పత్రాన్ని ఇస్తున్న సమయంలో ఓ స్వీట్ డబ్బాతో పాటు రూ.5 వేలు ఉన్న కవరును అందజేశాడు. ప్రజలందరూ తనకు ఆర్జీలు ఇస్తున్నట్లుగానే ఆ ఉపాధ్యాయుడు కూడా వినతి పత్రాన్ని కవర్‌లో పెట్టి ఇచ్చాడని భావించిన ఆ మంత్రివర్యులు అతనితో సంభాషణ తర్వాత మరో వ్యక్తిని పిలిచారు.


అయితే అక్కడే ఉండే మంత్రి సిబ్బంది ఆ కవరులో వినతి పత్రం కాకుండా డబ్బు ఉన్నట్లు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రూ.5 వేలు ఉన్నట్లు చెప్పారు. దీంతో సదరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిని అక్కడే ఉండమని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్. పోలీసులు వచ్చిన ఆ ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని ఆ కవర్ గురించి విచారిస్తున్నారు. అతడు ప్రస్తుతం బన్స్‌వారా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో గ్రేడ్-3 ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


దరఖాస్తులో ఉపాధ్యాయుడు చంద్రకాంత్ వైష్ణవ్ తాను విద్యార్థి దశ నుంచి ఏబీవీపీ, సంఘ్ పరివార్‌తో సంబంధం కలిగి ఉన్నానని, దానిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని రాసినట్లు పోలీసులు తెలిపారు. రాజస్థాన్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్‌తో అనుసంధానమై ఉన్న పాఠ్యాంశాల కమిటీలో స్థానం సంపాదించాలనే ఆశయంతో తాను మంత్రిని కలిసినట్లు ఆ ఉపాధ్యాయుడు పేర్కొన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa