భారతదేశ సముద్ర వాణిజ్య చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ షిప్ అయిన ఎంఎస్సీ ఇరినా .. మన పోర్టులో లంగరు వేసింది. కేరళలో ఇటీవలె ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన అత్యాధునిక విజింజం ఇంటర్నేషనల్ సీపోర్ట్లో ఈ ఎంఎస్సీ ఇరినాను విజయవంతంగా లంగరు వేశారు. ఇది దేశానికి కొత్త లోతైన నీటి ఓడరేవు సామర్థ్యం ఉందని ప్రపంచానికి స్పష్టం చేయడమే కాకుండా.. ప్రపంచ షిప్పింగ్ రంగంలో భారతదేశ సామర్థ్యాన్ని చూపించింది. ఇంతటి భారీ పరిమాణంలో ఉన్న ఒక కంటైనర్ షిప్ మన దేశ పోర్టుకు రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
24,346 టీఈయూల (20-అడుగుల సమాన యూనిట్లు) కంటైనర్ సామర్థ్యం కలిగిన.. ఎంఎస్సీ ఇరినా అతిపెద్ద కంటైనర్ షిప్గా ప్రపంచ రికార్డును కలిగి ఉంది. ఈ ఎంఎస్సీ ఇరినా.. 399.9 మీటర్ల పొడవు.. 61.3 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. ఇది ఒక సాధారణ ఫిఫా ఫుట్బాల్ మైదానం కంటే దాదాపు 4 రెట్లు పెద్దదిగా ఉంటుంది. ఈ నౌకలో కంటైనర్లను 26 వరుసల ఎత్తు వరకు పేర్చేలా రూపొందించారు. 2023 మార్చిలో ప్రారంభమైన ఈ నౌక.. 2023 ఏప్రిల్లో తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది. దక్షిణ ఆసియా పోర్ట్కు ఎంఎస్సీ ఇరినా మొదటిసారి రావడం విజింజం పోర్టు కెపాసిటీ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది.
ఈ విజింజం పోర్టును అదానీ పోర్ట్స్ కంపెనీ నిర్వహిస్తోంది. భారతదేశపు మొట్టమొదటి మెగా ట్రాన్స్ షిప్మెంట్ కంటైనర్ టెర్మినల్గా ఈ విజింజం పోర్టు నిలిచింది. తూర్పు పడమర కీలక షిప్పింగ్ మార్గాలకు కేవలం 10 నాటికల్ మైళ్ల దూరంలో వ్యూహాత్మకంగా ఈ విజింజం పోర్టును నిర్మించడం మరో విశేషం. ఈ సహజమైన లోతైన డ్రాఫ్ట్ (24 మీటర్లు) కారణంగా.. పెద్ద నౌకలకు డ్రెడ్జింగ్ అవసరం లేకుండానే సులభంగా లంగరు వేసేందుకు అవకాశం ఉంటుంది. ఇది భారతీయ ఎగుమతిదారులు, దిగుమతిదారులు గతంలో సింగపూర్, కొలంబో వంటి విదేశీ పోర్టులను ఉపయోగించడం వల్ల అదనపు ఖర్చులు కాగా.. వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది.
ఎంఎస్సీ ఇరినా కర్బన ఉద్గారాలను 4 శాతం వరకు తగ్గించే పవర్ సేవింగ్ టెక్నాలజీతో తయారు చేశారు. ఇది పర్యావరణ అనుకూల సముద్ర వాణిజ్యానికి సరికొత్త మైలు రాయిగా నిలుస్తోంది. ఇటీవల మే 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విజింజం పోర్ట్ను ప్రారంభించారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ఆటోమేటిక్ క్రేన్లతో భవిష్యత్ అవసరాలకు సిద్ధంగా దీన్ని రూపొందించారు. ఆ విజింజం పోర్టుకు ఎంఎన్సీ ఇరినా రాకతో భారతదేశ వాణిజ్యం, ఆర్థిక వృద్ధికి గణనీయమైన ఊతం లభిస్తుందని అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa