ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగ్రవాదం ప్రపంచ సమస్య రెండు దేశాల మధ్యది కాదన్న జైశంకర్

national |  Suryaa Desk  | Published : Tue, Jun 10, 2025, 06:04 PM

ఉగ్రవాదాన్ని ప్రపంచ సమస్యగా పరిగణించాలని, కేవలం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక అంశంగా చూడకూడదని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. ఐరోపా దేశాల పర్యటనలో భాగంగా బెల్జియం, లక్సంబర్గ్‌లలో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. చారిత్రకంగా చూస్తే, ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక ఉగ్రవాద దాడుల మూలాలు పాకిస్థాన్‌తో ముడిపడి ఉన్నాయని ఆయన ఆరోపించారు.బెల్జియంలో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ విదేశాంగ మంత్రి మాక్సిమ్ ప్రెవోట్ కూడా జైశంకర్‌తో పాటు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, భారతదేశ పురోగతి, దేశ సంపదను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జైశంకర్ వివరించారు.పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం జరిగిన పరిణామాలపై మాట్లాడుతూ, "ఉగ్రవాదం అనేది ఫలానా దేశానిది, మీది కాదు, నాది కాదు అని అనుకోవద్దు. ఇది ఒక ప్రపంచ సమస్య" అని ఆయన అన్నారు. మీడియా కూడా కొన్నిసార్లు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని, భారత్-పాకిస్థాన్ సమస్యను ద్వైపాక్షిక అంశంగానో లేదా కశ్మీర్ సమస్యగానో చూపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు."వాస్తవానికి ఉగ్రవాద సమస్య ఇతర దేశాలకు భిన్నంగా ఉంటుంది. కొన్ని సంస్థలు ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తాయి. కానీ, కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని తమ అధికారిక విధానంగా పెట్టుకుని నిర్వహిస్తున్నాయి" అని జైశంకర్ తీవ్రంగా విమర్శించారు. ఐరోపాలోని ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు."యూరప్‌లో కూడా ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. కానీ, దానిని రెండు దేశాల మధ్య అంశంగా ఎవరూ చూడరు. వారి పొరుగు దేశాల్లో ఏదీ ఉగ్రవాదాన్ని అధికారిక విధానంగా పెట్టుకోలేదు. ఇది ఏ రెండు దేశాలకు సంబంధించిన అంశమని నేను భావించడం లేదు. ఉగ్రవాదం కేవలం భారత్‌కు సంబంధించిన సమస్యే కాదు. గత 20-30 ఏళ్లుగా గమనిస్తే, చాలా ఉగ్రదాడుల మూలాల దర్యాప్తులు పాకిస్థాన్‌లోకి వచ్చి ఆగిపోతాయి" అని ఆయన వ్యాఖ్యానించారు.అంతకుముందు ఫ్రాన్స్‌లో పర్యటించిన జైశంకర్, అమెరికాతో వాణిజ్యపరమైన అంశాలపై కీలక ప్రకటన చేశారు. అమెరికా కొన్ని భారతీయ ఉత్పత్తులపై విధించిన టారిఫ్‌ల సస్పెన్షన్ గడువు ముగిసేలోపే ఆ దేశంతో ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంటామని ఫ్రాన్స్‌కు చెందిన 'లా ఫిగారో' పత్రికకు వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 2న భారత్‌పై అమెరికా 26 శాతం టారిఫ్‌లు విధించగా, ఆ తర్వాత దానిని జులై 9 వరకు సస్పెండ్ చేసింది. వాస్తవానికి ఏప్రిల్ 2 నుంచే ద్వైపాక్షిక చర్చలు ప్రారంభించినట్లు జైశంకర్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa