ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కశ్మీర్‌పై ట్రంప్ మధ్యవర్తిత్వానికి ఆస్కారముందన్న అమెరికా ప్రతినిధి

national |  Suryaa Desk  | Published : Wed, Jun 11, 2025, 09:26 AM

కశ్మీర్ వివాదంలో బయటి వ్యక్తుల జోక్యాన్ని భారత్ మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, అమెరికా మాత్రం ఈ అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నించినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ నిన్న వ్యాఖ్యానించారు.ట్రంప్ మధ్యవర్తిత్వ ప్రతిపాదన గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బ్రూస్ బదులిస్తూ "అధ్యక్షుడి మనసులో ఏముందో, ఆయన ప్రణాళికలేంటో నేను చెప్పలేను" అన్నారు. అయితే "అధ్యక్షుడు ట్రంప్ వేసే ప్రతి అడుగు దేశాల మధ్య దశాబ్దాల విభేదాలను, యుద్ధాలను పరిష్కరించడానికేనని మనందరికీ తెలుసు. కాబట్టి, ఆయన అలాంటి  అంశాన్ని పరిష్కరించాలనుకోవడంలో ఆశ్చర్యం లేదు" అని ఆమె పేర్కొన్నారు.ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ "జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ఏ సమస్య అయినా భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలన్నది మా సుదీర్ఘకాల జాతీయ విధానం. ఆ విధానంలో ఎలాంటి మార్పూ లేదు. పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించిన భారత భూభాగాన్ని ఖాళీ చేయడమే ప్రస్తుతం మిగిలి ఉన్న అంశం" అని స్పష్టం చేశారు. పొరుగు దేశాలతో వివాదాల్లో మూడో వ్యక్తి ప్రమేయాన్ని భారత్ తిరస్కరించడానికి 1972 నాటి తాష్కెంట్ ఒప్పందం కూడా ఒక ఆధారమని ఆయన గుర్తుచేశారు.ఇటీవల భారత పార్లమెంటరీ బృందం శశి థరూర్ నేతృత్వంలో డిప్యూటీ సెక్రటరీ లాండౌతో భేటీ అయినప్పుడు, ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు అమెరికా బలమైన మద్దతును, ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పునరుద్ఘాటించిందని బ్రూస్ తెలిపారు. కశ్మీర్ విషయంలో ట్రంప్‌ను ప్రశంసిస్తూ "ఎవరూ ఊహించని విధంగా కొందరిని చర్చల టేబుల్ వద్దకు తీసుకువచ్చిన ఏకైక వ్యక్తి ఆయన. ఆయన ప్రణాళికల గురించి నేను మాట్లాడలేను, కానీ ఆయన స్వభావం ప్రపంచానికి తెలుసు" అని అన్నారు.గత నెలలో భారత్, పాకిస్థాన్ మధ్య నాలుగు రోజులపాటు జరిగిన ఘర్షణల్లో కాల్పుల విరమణకు అమెరికానే మధ్యవర్తిత్వం వహించిందన్న వాదనను కూడా ఆమె పునరుద్ఘాటించారు. ఈ వాదనను భారత్ ఇప్పటికే ఖండించింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ల వల్లే ఇది సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు. అయితే, భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ వాదనలను తోసిపుచ్చారు. ఇరు దేశాలు ద్వైపాక్షిక స్థాయిలో సైనిక చర్యలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయని ఆయన స్పష్టం చేశారు. "ఆపరేషన్ సిందూర్"లో భారత సైనిక బలమే పాకిస్థాన్‌ను కాల్పుల విరమణకు అంగీకరించేలా చేసిందని జైస్వాల్ తెలిపారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa