భారత వ్యోమగామి శుభాంశు శుక్లా చేపట్టాల్సిన అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది. యాక్సియం-4 మిషన్లో భాగంగా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి ఆయన బుధవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరాల్సి ఉండగా, ప్రయోగానికి ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో యాత్రను వాయిదా వేస్తున్నట్లు స్పేస్ఎక్స్ సంస్థ ప్రకటించింది.ప్రయోగానికి సిద్ధం చేసిన ఫాల్కన్-9 రాకెట్లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ అయినట్లు స్పేస్ఎక్స్ తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో వెల్లడించింది. బూస్టర్ టెస్టు సమయంలో ఈ సమస్యను గుర్తించినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కూడా ధ్రువీకరించింది. లీకేజీ సమస్యను పూర్తిగా పరిష్కరించి, అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాతే ప్రయోగాన్ని చేపట్టాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. మరమ్మతు పనులకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని, త్వరలోనే కొత్త ప్రయోగ తేదీని ప్రకటిస్తామని స్పేస్ఎక్స్ తెలిపింది.వాస్తవానికి ఈ ప్రయోగం మంగళవారమే జరగాల్సి ఉంది. అయితే, ప్రయోగ కేంద్రం ఉన్న ఫ్లోరిడా ప్రాంతంలో వాతావరణం అనుకూలించకపోవడంతో దీనిని బుధవారానికి వాయిదా వేశారు. తాజాగా ఇప్పుడు సాంకేతిక కారణాలతో రెండోసారి ప్రయోగం వాయిదా పడింది.అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ 'యాక్సియం స్పేస్' ఈ ప్రతిష్ఠాత్మక మిషన్ను నిర్వహిస్తోంది. ఈ మిషన్లో ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ ఐరోపా అంతరిక్ష సంస్థ భాగస్వాములుగా ఉన్నాయి. ఫాల్కన్-9 రాకెట్ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ మిషన్లో శుభాంశు శుక్లా మిషన్ పైలట్గా కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు. భూమి నుంచి బయలుదేరిన 28 గంటల తర్వాత ఈ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమవుతుంది. అక్కడ శుభాంశు బృందం 14 రోజుల పాటు బస చేసి, భారరహిత స్థితిలో పలు కీలక ప్రయోగాలు నిర్వహిస్తుంది. అలాగే, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో కూడా వారు అంతరిక్షం నుంచి ముచ్చటించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa