ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గంట ముందే బయల్దేరండి.. శ్రీవారి భక్తులకు టీటీడీ రిక్వెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 12, 2025, 06:29 PM

తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సూచనలు చేసింది. తిరుమల కనుమ దారుల వద్ద బీ.టీ రోడ్డు పనులు చేపట్టినట్లు టీటీడీ తెలిపింది. ఈ పనులు వేగవంతం చేశామన్న టీటీడీ.. రోడ్డు మరమ్మత్తు పనుల నేపథ్యంలో తిరుమలకు రాకపోకలు సాగించే వాహనదారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, జాగ్రత్తగా వాహనాలను నడపాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఘాట్ రోడ్డును మూసివేస్తే.. భక్తులకు అసౌకర్యం కలుగుతుందనే ఉద్దేశంతో ఘాట్ రోడ్డును మూసివేయలేదని టీటీడీ తెలిపింది. బీటీ రోడ్డు పనులను వేగవంతం చేశామని.. నిర్దేశిత సమయంలోనే మరమ్మతులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.


ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులు కనీసం గంట ముందు తిరుమలకు బయల్దేరాలని టీటీడీ సూచించింది. బీటీ రోడ్డు మరమ్మతుల కారణంగా వాహనాలు నెమ్మదిగా రావాల్సి వస్తోందని.. అలాగే అక్కడక్కడా అగుతూ ప్రయాణించాల్సి ఉందని టీటీడీ తెలిపింది. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులు కనీసం గంట ముందుగానే తమ ప్రయాణాన్ని ప్రారంభించాలని టీటీడీ సూచించింది.


అలిపిరి లింక్ బస్టాండ్ సమీపంలో ప్రమాదం..


మరోవైపు తిరుపతిలోని అలిపిరి లింక్ బస్టాండ్ సమీపంలో గురువారం ప్రమాదం తప్పింది. భూదేవి కాంప్లెక్స్ వద్ద టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురైంది. టూరిస్ట్ బస్సు భూదేవి కాంప్లెక్స్ వద్ద ఉన్న పిట్టగోడను ఢీకొట్టింది. అయితే బస్సులో భక్తులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. భూదేవి కాంప్లెక్స్ వద్ద ఎస్ఎస్‌డీ టోకెన్లు, దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తుంటారు. దీంతో ఈ ప్రాంతమంతా భక్తులతో నిండిపోయి ఉంటుంది. అయితే ప్రమాదం జరిగినప్పుడు.. టోకెన్స్ జారీ చేసే సమయం కాదు. దీంతో ఎలాంటి ఇబ్బంది కలగలేదు. మరోవైపు బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి పిట్టగోడను ఢీకొట్టినట్లు డ్రైవర్ చెప్పారు. 40 మంది ప్రయాణికులతో టూరిస్టు బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చింది.


శ్రీవారి దర్శనానికి 15 - 18 గంటల సమయం


మరోవైపు తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. బుధవారం 79,296 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 33,511 మంది తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఒక్కరోజే తిరుమల శ్రీవారి హుండీకి 3.49 కోట్ల ఆదాయం వచ్చింది. ఎస్ఎస్‌డీ టోకెన్లు కలిగిన సర్వదర్శనానికి 15 నుంచి 18 గంటలు సమయం పట్టినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa