ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.550 కోట్లతో.. విశాఖలో అధునాతన క్యాన్సర్ ఆస్పత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 12, 2025, 06:33 PM

విశాఖపట్నంలో అధునాతన క్యాన్సర్ ఆస్పత్రి కొలువుదీరనుంది. ఏపీతో పాటుగా తూర్పు రాష్ట్రాలలోని క్యాన్సర్ బాధితులకు చికిత్స అందించడం కోసం విశాఖలో అడ్వాన్స్‌డ్ క్యాన్సర్ కేర్ బ్లాక్ ఏర్పాటు చేయనున్నారు. విశాఖలో అడ్వాన్స్‌డ్ క్యాన్సర్ కేర్ బ్లాక్‌కు ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మెమోరియల్ సెంటర్ శంకుస్థాపన చేశాయి. టాటా మెమోరియల్ సెంటర్‌తో కలిసి విశాఖపట్నంలో హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త భవనం నిర్మిస్తోంది. ఈ పనులను ప్రారంభించినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది.


సుమారు 3.9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, అత్యుత్తమ మెడికల్ టెక్నాలజీతో ఈ అధునాతన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ. 550 కోట్ల పైగా నిధులను ఐసీఐసీఐ బ్యాంకు సమకూరుస్తోంది. మొత్తం ఎనిమిది అంతస్తుల్లో దీనిని నిర్మించనున్నారు. ఐసీఐసీఐ ఫౌండేషన్ బ్లాక్ ఫర్ చైల్డ్ అండ్ బ్లడ్ క్యాన్సర్ భవనం అందుబాటులోకి వచ్చాక ఏటా 3,000 మంది పేషంట్లకు సేవలందించవచ్చు.


విశాఖపట్నంలోని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ద్వారా ప్రస్తుతం ఏటా 6,200 రోగులకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఈ భవనం అందుబాటులోకి వస్తే మరో 3 వేల మందికి సేవలు అందించే అవకాశం ఉంది. భారతదేశంలోని అత్యుత్తమ స్పెషలైజ్డ్ క్యాన్సర్ చికిత్సా కేంద్రాల్లో ఒకటిగా దీనిని తీర్చిదిద్దనున్నారు. ఈ అడ్వాన్స్‌డ్ క్యాన్సర్ కేర్ బ్లాక్‌ 2027 నాటికి పూర్తవుతుందని అంచనా. ఐసీఐసీఐ బ్యాంక్ సీఎస్ఆర్ విభాగం ఐసీఐసీఐ ఫౌండేషన్ ఫర్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ దీన్ని అమలును పర్యవేక్షిస్తుంది.


మరోవైపు దేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను పటిష్టపర్చాలన్న లక్ష్యంతో.. క్యాన్సర్ కేర్ విషయంలో టాటా మెమోరియల్ సెంటర్‌తో కలిసి పనిచేస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ Mr. ప్రదీప్ కుమార్ సిన్హా తెలిపారు. వైద్యసేవలు అవసరమైన వారికి అత్యంత నాణ్యమైన వైద్య సంరక్షణను అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా..తూర్పు రాష్ట్రాల్లోని పేషంట్లకు సేవలందించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. పెరుగుతున్న క్యాన్సర్ చికిత్స అవసరాలను తీర్చడంలో సహాయపడుతుందని తెలిపారు.


విశాఖపట్నంలోని ఐసీఐసీఐ ఫౌండేషన్ చైల్డ్ అండ్ బ్లడ్ క్యాన్సర్ బ్లాక్‌లో ఇంటెన్సివ్ కీమోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్, అధునాతన రేడియేషన్ థెరపీ, CAR-T సెల్ థెరపీలాంటి అధునాతన ఇమ్యునోథెరపీలు అందుబాటులో ఉంటాయి. అలాగే మూడు లీనియర్ యాక్సిలరేటర్లు, MRI, CVT-PET స్కానింగ్, అత్యంత ఆధునిక మెడికల్ ఇమేజింగ్, డయాగ్నోస్టిక్స్, 14 బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ గదులు, 14 ICUలు, పరిశోధనల కోసం ప్రయోగశాలలు, చికిత్స ప్లానింగ్, శిక్షణ కోసం జాయింట్ డిస్కషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa