వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై రాష్ట్ర గనులు, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పేర్ని నాని పాపం పండిందని, గత ఐదేళ్లలో ఆయన దోచుకున్న అవినీతి సొమ్మును కక్కిస్తామని, వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఘాటుగా హెచ్చరించారు. దమ్ముంటే విచారణకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. "గత ఐదేళ్ల పాలనలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి, బందరు నియోజకవర్గాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. ఇప్పుడు ఓటమి తర్వాత కూడా బుద్ధి రాలేదు. అరెస్ట్ భయంతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో పేర్ని నాని ఒక బ్రోకర్లా వ్యవహరించారు" అని కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.బందరు పోర్టు విషయంలో పేర్ని నానిపై కొల్లు రవీంద్ర మరింత తీవ్ర ఆరోపణలు చేశారు. "2006లోనే బందరు పోర్టును అమ్మేసేందుకు పేర్ని నాని ప్రయత్నించారు. అప్పుడు ప్రజల పోరాటంతోనే బందరు పోర్టును సాధించుకున్నాం. మరి గత ఐదేళ్లలో ఈ పోర్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారు? పోర్టు నిర్మాణ పనులను నత్తనడకన సాగించి, కమీషన్లు దండుకున్నారు. ఇప్పుడు ఓడిపోయాక పోర్టుపై ప్రేమ ఒలకబోస్తున్నారు" అని ఎద్దేవా చేశారు. తమ కూటమి ప్రభుత్వం 2026 నాటికి బందరు పోర్టును పూర్తి చేసి చూపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బందరును పర్యాటక, క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. పోర్టు పూర్తయితే వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.నియోజకవర్గానికి పట్టిన అతిపెద్ద శనిగ్రహం పేర్ని నాని. ఆయన సానుభూతి రాజకీయాలకు కాలం చెల్లింది. ప్రజలు తిరస్కరించినా ఆయనకు బుద్ధి రాలేదు. తప్పు చేసి ఇతరులపై బురద జల్లే ప్రయత్నం చేయడం సిగ్గుమాలిన చర్య. ఆయన అవినీతి చిట్టాను త్వరలో ప్రజల ముందు ఉంచుతాం. అసెంబ్లీలో కూడా చొక్కా పట్టుకుని నిలదీస్తా," అని కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వారు ఎంతటివారైనా చట్టం ముందు దోషులుగా నిలబెట్టి, శిక్ష పడేలా చేస్తామని, దోషులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, అవినీతిపరుల భరతం పడతామని అన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa