ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బుక్కెడు బువ్వ కోసం పడిగాపులు కాస్తున్న వారిపై ఇజ్రాయెల్ దాడులు.. 45 మంది మృతి

international |  Suryaa Desk  | Published : Tue, Jun 17, 2025, 09:36 PM

ఓవైపు అయిన వాళ్లను కోల్పోయి, మరోవైపు తినేందుకు బుక్కెడు బువ్వ కూడా దొరక్క ఇబ్బంది పడుతున్న పాలస్తీనియన్లకు.. ఐక్యరాజ్య సమితి మానవతా సాయం అందించాలని నిర్ణయించుకుంది. ముఖ్యంగా అక్కడి వాళ్లకు కనీసం తినేందుకు తిండి కూడా దొర్కకపోవడంతో.. అనేక మంది చనిపోయారు. దీంతో ఆ విషయం అర్థం చేసుకున్న ఐక్యరాజ్య సమితి.. వారికి సాయం చేయాలని ఆందోళన వ్యక్తం చేసింది. ఈక్రమంలోనే స్పందించిన ఓ సంస్థ శరణార్థులకు అనేక ట్రక్కుల్లో ఆహారం పంపిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న శరణార్థులు కూడా బుక్కెడు బువ్వ కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు.


ఈ సమయంలోనే ఇజ్రాయెల్.. పాలస్తీనియన్లపై విరుచుకు పడింది. సాయం కోసం ఎదురు చూస్తున్న వారని కూడా చూడకుండా దాడులకు పాల్పడింది. దీంతో 45 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. అలాగే అనేక మంది తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కూడా చాలా మంది పరిస్థితి విషమంగా ఉండగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పటికే యుద్ధంతో అల్లకల్లోలమైన గాజా ప్రజల జీవితాల్లో ఇది మరో చేదు అధ్యాయాన్ని లిఖించింది.


ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో తీవ్ర ఆహారం సంక్షోభం ఏర్పడింది. అనేక మంది ఆకలికి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. ఇక చిన్న పిల్లల్లో ఎంత మంది చనిపోయారనే దానిపై సరైన లెక్క కూడా లేదు. ఇంతటి తీవ్రమైన పరిస్థితి ఉన్నప్పటికీ.. గాజాలోకి మానవీయ సాయం లేకుండా ఇజ్రాయెల్ కట్టడి చేసింది. ఈక్రమంలోనే అమెరికా, ఇజ్రాయెల్ మద్దతు ఉన్న దాతృత్వ సంస్థ.. గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ పాలస్తీనీయులకు ఆహారం సరఫరా చేసే కేంద్రాలను ఏర్పాటు చేసింది.


దీంతో పెద్ద ఎత్తున శరణార్థులు అక్కడికి ఆహారం కోసం వచ్చి వేచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు తమకు ఆహారం అందుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే అప్పుడే అక్కడకు ఇజ్రాయెల్ దళాలు వచ్చాయి. అనూహ్యంగా కాల్పులు జరుపుతూ.. ఆ ప్రాంతం మొత్తాన్ని వణికించారు. ముఖ్యంగా శరణార్థులనే లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. దీంతో అనేక మంది శరీరాల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లగా.. ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. అనేక మంది అక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచారు. మరెంతో మంది తీవ్ర గాయాలపాలై విపరీతంగా రోదించారు. అయితే ఈ విషయాలను ప్రత్యక్ష సాక్షులే వివరిస్తుండగా.. అంతా షాక్ అవుతున్నారు.


ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి వంటివి కూడా ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆహారం కోసం ఎదురుచూస్తున్న నిస్సహాయ ప్రజలపై కాల్పులు జరపడం అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని చెబుతున్నాయి. ఈ మారణకాండకు బాధ్యులైన వారిపై తక్షణమే దర్యాప్తు జరిపి, న్యాయం చేయాలని ప్రపంచ దేశాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. గాజాలో శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఇలాంటి విషాదాలు పునరావృతమయ్యే అవకాశం ఉందని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఈ ఘటనపై ఇజ్రాయెల్ సైన్యం ఇంకా అధికారికంగా స్పందించలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa