రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్కు గుడ్బై చెప్పాక.. టీమిండియా టెస్టు జట్టుకు తదుపరి కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. అయితే ఇప్పటికే రెగ్యులర్ కెప్టెన్ గైర్హాజరీలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పలుమార్లు సారథిగా వ్యవహరించాడు. దీంతో రోహిత్ శర్మ తర్వాత అతడికే టెస్టు జట్టు పగ్గాలు అందిస్తారని అంతా భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం అనూహ్యంగా యంగ్ బ్యాటర్లు శుభ్మన్ గిల్ను కెప్టెన్ చేశారు. దీంతో బుమ్రాకు కావాలనే కెప్టెన్సీ ఇవ్వలేదా? లేదా బుమ్రా వద్దన్నాడా? అనే ప్రశ్నలు తలెత్తాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బుమ్రా.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాడు.
వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగానే తనకు కెప్టెన్సీ బాధ్యతలు దక్కలేదని బుమ్రా వెల్లడించాడు. సారథ్య బాధ్యతలు తనకు వద్దని.. ఆటగాడిగానే కొనసాగుతానని తానే బీసీసీఐకి చెప్పినట్లు పేర్కొన్నాడు.
“రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్కు ముందే అంటే ఐపీఎల్ 2025 జరుగుతున్న సమయంలోనే నేను బీసీసీఐతో మాట్లాడా. ఇంగ్లండ్తో 5 టెస్ట్ల సిరీస్లో నాపై ఉండే వర్క్లోడ్ గురించి చర్చించా. ఆ తర్వాత నా వెన్నునొప్పికి చికిత్స అందిస్తున్న.. వైద్యులు, ఫిజియోలతోనూ మాట్లాడా. లీడర్ షిప్ గ్రూప్ నుంచి నాకు నేనుగా తప్పుకున్నా. నిజానికి బీసీసీఐ నన్ను కెప్టెన్గా పరిగణించింది. కానీ నేను ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో ఐదు మ్యాచ్లూ ఆడే పరిస్థితి లేదు. అన్ని మ్యాచ్లు ఆడనప్పుడు కెప్టెన్గా ఉండకూడదు. ఎందుకంటే మూడు మ్యాచ్లకు ఒక కెప్టెన్, మరో రెండు మ్యాచ్లకు ఇంకో కెప్టెన్ ఉండటం బాగోదు. ఇది జట్టుకు నష్టాన్ని కలిగిస్తుంది. దీంతో జట్టు ప్రయోజనాల దృష్ట్యా నేనే స్వయంగా బీసీసీఐకి ఫోన్ చేసి.. లీడర్ షిప్ గ్రూప్ నుంచి వైదొలుగుతానని చెప్పా” అని బుమ్రా చెప్పాడు.
తనకు కెప్టెన్సీ కంటే కూడా క్రికెట్ అంటేనే ఎక్కువ ఇష్టమని బుమ్రా అన్నాడు. ఆటగాడిగా వీలైనంత వరకు జట్టు విజయంలో భాగం కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టు మ్యాచ్లలో ఆడిన బుమ్రా చివరి టెస్టు మ్యాచ్లో వెన్నునొప్పికి గురయ్యాడు. అతిగా బౌలింగ్ చేయడంతో ఇది తలెత్తింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి సైతం అతడు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అతడి విషయంలో జాగ్రత్తగా ఉండాలని బీసీసీఐ డిసైడ్ అయింది. వర్క్ లోడ్ మేనేజ్మెంట్పై దృష్టి సారించి పరిమిత సంఖ్యలో మ్యాచ్లలో బరిలోకి దించాలని ఆలోచిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa