వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27 ఆరంభ రోజే బంగ్లాదేశ్ బ్యాటర్లు విజృంభించారు. గల్లే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో బంగ్లాదేశ్ సత్తా చాటింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా కెప్టెన్ షాంటో , ముష్ఫికర్ క్రీజులో పాతుకుపోయి శ్రీలంక బౌలర్లపై తమ పంజా విసిరారు.. ఇద్దరు బ్యాటర్లూ సెంచరీలు చేసి సత్తా చాటారు.
శ్రీలంక వేదికగా రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ నేపథ్యంలో ఈ రోజు మొదటి మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లా టాప్ త్రీ బ్యాటర్లు వెంటవెంటనే అవుటయ్యారు. 45 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోవడంతో బంగ్లా తక్కువ పరుగులకే ఆలౌట్ అవుతుందని అందరూ అనుకున్నారు.
కెప్టెన్ షాంటో, ముష్ఫికర్ రహీమ్ మరో వికెట్ పడకుండా మొదటి సెషన్ నుంచి మూడో సెషన్ వరకూ క్రీజులోనే నిల్చున్నారు. షాంటో దూకుడుగా ఆడుతూ రన్రేట్ను పెంచితే ముషిఫికర్ నిలకడగా స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. వీరిద్దరూ 241 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కెప్టెన్ షాంటో 136, ముషిఫికర్ రహీమ్ 105 పరుగులతో నాటౌట్గా క్రీజులో ఉన్నారు. మొదటి రోజు 90 ఓవర్లు ఆడిన బంగ్లా 3 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది.
ముషిఫికర్ రహ్మాన్కి టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది 12వ శతకం కాగా.. షాంటోకి ఇది ఆరో సెంచరీ. ఓవరాల్గా 36 టెస్టు మ్యాచ్లు ఆడిన షాంటో 67 ఇన్నింగ్స్లలో 6 సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలతో 2025 పరుగులు చేయగా.. ముషిఫికర్ రహీమ్ 97 టెస్టులలో 178 ఇన్నింగ్స్లు ఆడి 12 సెంచరీలు, మూడు డబుల్ సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఓవరాల్గా 6160 పరుగులు చేశాడు.
బంగ్లాదేశ్ ఓపెనర్లు షాద్మాన్ ఇస్లాం 14, అనముల్ హఖ్ 0, ఫస్ట్ డౌన్ బ్యాటర్ మోమినల్ హఖ్ 29 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో అషిత ఫెర్నాండో ఒక వికెట్ తీయగా.. తారిందు రత్నాయకే రెండు వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్ చేతిలో ఎక్కువ వికెట్లు ఉండటంతో రెండో రోజు భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa