ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పుల బాధతో ముగ్గురు రైతులు ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 18, 2025, 09:19 AM

వ్యవసాయంలో నష్టాలతో అప్పుల పాలైన ముగ్గురు రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడు జిల్లాలో మంగళవారం జరిగింది. నాదెండ్ల మండలం నాదెండ్ల గ్రామంలోని రామాపురం కాలనీకి చెందిన నాసం ఆదినారాయణ(45) ఏడు సంవత్సరాలుగా తన ఎకరన్నరతో పాటు సుమారు 50కి పైగా ఎకరాలను కౌలుకు తీసుకొని మిర్చి, పత్తి, శనగ తదితర పంటలు సాగు చేస్తున్నాడు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేక పోవటంతో పాటు పైర్లు తెగుళ్ల బారిన పడటం, గిట్టుబాటు ధర లేక పోవటంతో సుమారు రూ 70 లక్షల అప్పులపాలయ్యాడు. రుణదాతలు ఇంటికి వచ్చి ఒత్తిడి చేయటంతో తట్టుకోలేక గ్రామ సమీపంలోని పొలాల్లో సోమవారం రాత్రి పురుగు మందు తాగాడు. మంగళవారం ఉదయం ఆదినారాయణ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అదే విధంగా మండలంలోని తూబాడు గ్రామానికి చెందిన సిరిబోయిన గోపాలరావు(44) తన 30 సెంట్లతో పాటు సుమారు 12 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది మిర్చి పైరుకు తెగుళ్లు సోకటంతో పెట్టుబడులు కూడా దక్కలేదు. పొగాకు పండించినా కొనే వారు లేక పోవటంతో నిల్వ చేసి పట్టాలు కప్పాడు. సుమారు రూ.20 లక్షల మేర అప్పులపాలయ్యాడు. సోమవారం సాయంత్రం తన ట్రాక్టర్‌ను అప్పు ఇచ్చిన వారు తీసుకెళ్లడంతో మనస్తాపానికి గురయ్యాడు. తన ఇంటికి సమీపంలోని డొంక వద్దకు వెళ్లి పురుగు మందు తాగి మృతి చెందాడు. ఎస్‌ఐ పుల్లారావు మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఆత్మహత్యకు పాల్పడిన రైతులు గోపాలరావు, ఆదినారాయణ కుటుంబాలను వ్యవసాయ శాఖ కమిషనర్‌ ఎస్‌.డిల్లీరావు, పల్నాడు జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు మంగళవారం సాయంత్రం పరామర్శించారు. రైతుల ఇంటికి వెళ్లి వారి భౌతిక కాయాలకు నివాళులర్పించారు. ఆత్మహత్యకు దారి తీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం న్యాయం జరుగుతుందని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. కాగా.. ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామానికి చెందిన బండి కొండయ్య (52) ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. మూడు ఎకరాల్లో మిర్చి, ఎకరన్నరలో వరి, అర ఎకరంలో పొగాకు సాగు చేశాడు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడి కూడా రాక, అప్పులు రూ.4 లక్షలు తీర్చే మార్గంలేక మనస్తాపం చెంది కౌలుకు తీసుకున్న పొలంలోని వేప చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని చిన్న కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ ఎం.ఉమామహేశ్వరరావు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa