వాహనదారులకు స్వాతంత్య్ర దినోత్సవ కానుక ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఆగస్టు 15 నుంచి ఫాస్టాగ్ కొత్త పాసులు తీసుకొస్తోంది. ఈమేరకు కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాసులు జారీ చేస్తామని తెలిపింది. దీని ద్వారా వాహనదారులు జాతీయ రహదారులపై ప్రయాణించినప్పుడు ఆర్థిక భారం తగ్గడంతో పాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రయాణం కొనసాగించవచ్చని తెలిపింది. రూ.3 వేలు చెల్లించి పాస్ తీసుకోవచ్చని, దీని ద్వారా ఏడాదంతా 200 ట్రిప్పులు దేశంలో ఎక్కడైనా ప్రయాణించవచ్చని పేర్కొంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. 'అవాంతరాలు లేని హైవే ప్రయాణం కోసం జరుగుతున్న మార్పుల్లో ఇది కీలకమైన అడుగు. రూ.3 వేల ధరతో ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ పరిచయం చేస్తున్నాం. ఇది ఆగస్టు 15, 2025 నుంచి అమలులోకి వస్తుంది. ఈ పాస్ యాక్టివేషన్ తేదీ నుంచి ఒక సంవత్సరం లేదా 200 ట్రిప్పుల వరకు చెల్లుబాటు అవుతుంది. ఏది ముందుగా వస్తే అది. ఈ పాస్ కార్లు, జీపులు, వ్యాన్ల వంటి వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించాం' అని తెలిపారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
వార్షిక పాస్ దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై తక్కువ ఖర్చుతో ప్రయాణం సజావుగా సాగేందుకు అనుమతిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. యాక్టివేషన్, పునరుద్ధరణ కోసం ప్రత్యేక లింక్ త్వరలో రాజ్మార్గ్ యాత్ర యాప్, అలాగే NHAI, MoRTH అధికారిక వెబ్సైట్లలో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఏడాది పాస్ తీసుకున్న తర్వాత యాక్టివేషన్, అప్డేషన్ వంటివి ఆన్లైన్ ద్వారా సులభంగా చేసుకోవచ్చన్నారు.
ఇక వేగంగా ప్రయాణం
ఈ కొత్త విధానం 60 కి.మీ పరిధిలో ఉన్న టోల్ ప్లాజాల గురించి చాలా కాలంగా ఉన్న ఫిర్యాదులను పరిష్కరిస్తుందని అభిప్రాయపడ్డారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఒకే, సరసమైన లావాదేవీ ద్వారా టోల్ చెల్లింపులను సులభతరం చేస్తుందన్నారు. అదేవిధంగా టోల్ ప్లాజా వద్ద వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తందని, దీంతో రద్దీ తగ్గుతుంది పేర్కొన్నారు. టోల్ ప్లాజాల వద్ద వివాదాలు కూడా తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. దేశంలోని లక్షలాది మంది వాహనదారులు ఇక వేగవంతమైన, సులభమైన ప్రయాణ అనుభవాన్ని ఆస్వాదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వార్షిక పాస్ లక్ష్యం ఇదేనని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa