ట్రెండింగ్
Epaper    English    தமிழ்

3011 రోజుల తర్వాత ఆడిన రీఎంట్రీ మ్యాచ్‌లో కరుణ్ నాయర్ డకౌట్‌

sports |  Suryaa Desk  | Published : Sat, Jun 21, 2025, 11:13 PM

సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టు తరఫున టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన కరుణ్ నాయర్‌ను దురదృష్టం వెంటాడింది. 3011 రోజుల విరామం తర్వాత అతడు భారత్ తరఫున తిరిగి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇంగ్లాండ్‌తో హెడింగ్లే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో అతడు చోటు దక్కించుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో అతడు విఫలమయ్యాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ ప్లేయర్.. ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరాడు.


కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఔట్ అయ్యాక క్రీజులోకి వచ్చాడు కరుణ్ నాయర్. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడని అంతా భావించారు. కానీ అతడిని దురదృష్టం వెంటాడింది. తాను ఎదుర్కొన్న నాలుగో బంతిని కవర్స్ వైపు ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ఓలీపోప్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టి.. కరుణ్ నాయర్ ‌ను ఔట్ చేశాడు. న్యూజిలాండ్ ఫీల్డర్ గ్లెన్ ఫిలిప్స్ తరహాలో అద్భుత క్యాచ్ అందుకున్నాడు. బెన్ స్టోక్స్ వేసిన 105వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో కరుణ్ నాయర్ నిరాశగా పెవిలియన్ వైపు నడిచాడు.


ప్రస్తుతం కరుణ్ నాయర్‌ క్యాచ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు అయ్యో నాయర్ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో డెబ్యూ చేసిన సాయి సుదర్శన్ కూడా ఒక్క పరుగు కూడా చేయకుండానే ఔట్ అయ్యాడు. అతడు కూడా నాలుగు బంతులు ఎదుర్కొని.. పరుగుల ఖాతా తెరవలేకపోయాడు. దీంతో భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఈ ఇద్దరు ప్లేయర్లు.. తీవ్రంగా నిరాశపరిచారు. మరి రెండో ఇన్నింగ్స్‌లో అయినా వీరిద్దరూ రాణిస్తారా? లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 471 పరుగులకు ఆలౌట్ అయింది. యశస్వి జైశ్వాల్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్‌లు సెంచరీలతో రాణించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa