ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిర్‌ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

national |  Suryaa Desk  | Published : Sun, Jun 22, 2025, 08:37 PM

ఇటీవల ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్‌లో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ ఘటన తరువాత విమాన రద్దులు, రీషెడ్యూల్ ఎక్కువగా జరిగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన మరొకటి జరిగింది. శనివారం ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అయిందని ఆ సంస్థ అధికారులు తెలిపారు. బర్మింగ్‌హామ్ నుంచి దిల్లీకి బయలుదేరిన విమానానికి బాంబు బెదిరింపు రావడంతో.. దారి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు వెల్లడించారు.


బర్మింగ్‌హామ్ నుండి దీల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా AI114 విమానానికి శనివారం (జూన్ 21) బాంబు బెదిరింపు వచ్చినట్లు ఆదివారం విమానయాన సంస్థ ప్రతినిధి తెలిపారు. దీంతో విమానాన్ని రియాద్‌కు దారి మళ్లించినట్లు చెప్పారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని వెల్లడించారు. విమానంలో భద్రతా తనిఖీలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, శుక్రవారం (జూన్ 20) సాంకేతిక లోపం కారణంగా ఇండిగో విమానం రద్దు అయింది. విమానం కదలడానికి ముందే సమస్యను గుర్తించి.. ప్రయాణికులందరినీ సురక్షితంగా దించేశారు.


అంతేకాకుండా, దిల్లీ నుంచి పాట్నాకు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని కూడా దారి మళ్లించినట్లు శనివారం అధికారులు తెలిపారు. వాతావరణం సరిగా లేకపోవడంతో వారణాసికి మళ్లించి ల్యాండింగ్ చేసినట్లు వెల్లడించారు. అయితే, ఆ తర్వాత విమానం సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుందని చెప్పారు.


అంతకుమందు, శుక్రవారం గువాహటి నుంచి చెన్నైకి 168 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఇండిగో విమానం అత్యవసరంగా బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. విమానంలో ఇంధనం తక్కువగా ఉండటంతో కెప్టెన్ 'మేడే' కాల్ ఇచ్చాడు. విమానాన్ని మొదట చెన్నైలో ల్యాండ్ చేయడానికి ప్రయత్నించారు. ల్యాండింగ్ గేర్‌తో రన్‌వేను తాకిన తర్వాత.. పైలట్ ల్యాండింగ్‌ను ఆపాడు. అనంతరం మళ్లీ విమానం గాల్లోకి తీసుకెళ్లారు. అనంతరం బెంగళూరుకు 35 మైళ్ల దూరంలో ఉండగా ఎమర్జెన్సీ కాల్ చేసి.. విమానాన్ని ల్యాండ్ చేశారు.


ఇటీవల (జూన్ 12) అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో మొత్తం 270 మందికి పైగా మరణించారు. విమానంలో ప్రయాణించిన వారిలో కేవలం ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలం నుంచి బ్లాక్ బాక్స్‌లు (కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్) సేకరించారు. బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషిస్తే.. ప్రమాదానికి గాల కారణాలు తెలిసే అవకాశం ఉంది. కాగా, ప్రాథమిక నివేదికల ప్రకారం, టేకాఫ్ అయిన వెంటనే విమానం "మేడే" కాల్ చేసి, ఇంజిన్లలో శక్తిని కోల్పోయినట్లు నివేదించినట్లు తేలింది. ఇంజిన్ వైఫల్యం లేదా విద్యుత్ సమస్యలు ప్రమాదానికి కారణం అయి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa