ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలు ఒంటిరిగా ఇండియాకు వెళ్లొద్దు.. అమెరికా హెచ్చరిక

national |  Suryaa Desk  | Published : Sun, Jun 22, 2025, 08:43 PM

భారత్ వెళ్లే తన పౌరులకు ముఖ్యంగా మహిళలకు అమెరికా ఆకస్మాత్తుగా జారీచేసిన ట్రావెల్ అడ్వైజరీ విస్మయానికి గురిచేస్తోంది. భారత్ వెళ్లే అమెరికన్లు మరిన్ని ఎక్కువ జాగ్రత్తలు పాటించాలని అమెరికా విదేశాంగ శాఖ  లెవెల్-2  ట్రావెల్ వార్నింగ్ జారీ చేసింది. జూన్ 16న జారీచేసిన ఈ హెచ్చరిక ప్రకారం.. భారత్‌లో అత్యాచారాలు, ఉగ్రదాడులు పెరుగుతున్నాయని పేర్కొంది. మహిళలు ఒంటరిగా ఆ దేశంలో పర్యటించొద్దని సూచించడం గమనార్హం. ‘భారతదేశంలో వేగంగా పెరుగుతున్న నేరాల్లో అత్యాచారాలు ఒకటి. పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లు, రవాణా కేంద్రాలు, ప్రభుత్వ భవనాలపై హింసాత్మక నేరాలు, ఉగ్రవాద దాడులు జరుగుతాయి’ అని తెలిపింది. భారత్ విషయంలో అమెరికా వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందనడానికి ఇదే నిదర్శనం. ఇటీవల పాకిస్థాన్‌తో స్నేహానికి డొనాల్డ్ ట్రంప్ తహతహలాడుతున్నారు.


గ్రామీణ ప్రాంతాల్లో తమ పౌరులకు అత్యవసర సేవలు అందించే సామర్థ్యం అమెరికా ప్రభుత్వానికి పరిమితంగా ఉందని తెలిపింది. ముఖ్యంగా తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలు ఎక్కువ ప్రమాదంలో ఉన్నట్టు పేర్కొంది. ఈ కారణంగా భారతదేశంలో పనిచేస్తున్న అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రాంతాలకు ప్రయాణించాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాలని సూచించింది. ఈ ట్రావెల్ అడ్వైజరీలో కొన్ని భారతీయ చట్టాలను కూడా స్పష్టం చేసింది:


‘‘శాటిలైట్ ఫోన్‌లు లేదా జీపీఎస్ పరికరాలు కలిగి ఉండటం భారతదేశంలో నిషేధం.. అలా చేస్తే 200,000 డాలర్లకు వరకు జరిమానా లేదా మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించొచ్చు. .మహిళలు ఒంటరిగా ప్రయాణించవద్దు’’ అని ప్రత్యేక సూచనలు చేశారు. అడ్వైజరీలో అత్యంత అప్రమత్తత అవసరమైన ప్రాంతాలు జమ్మూ కశ్మీర్, భారత-పాకిస్థాన్ సరిహద్దు, తూర్పు, మధ్య భారతదేశం (ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు) అని వివరించారు.


అమెరికా ఉద్యోగులు రాష్ట్రాల రాజధానులను మినహాయించి ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రత్యేక అనుమతి అవసరమని తెలిపింది. బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, తూర్పు మహారాష్ట్ర, తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ప్రయాణానికి ముందుగా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. కాగా, కెనడా పర్యటనకు ప్రధాని మోదీ వెళ్లేలోపు ట్రంప్ అమెరికాకు చెక్కేయడం వంటి పరిణామాలు ఏదో జరుగుతుందనే అనుమానాలకు తావిస్తోంది.


భారత్-నేపాల్ భూ మార్గంలో ప్రయాణం వద్దు


భూమి మార్గం నుంచి భారత-నేపాల్ సరిహద్దు దాటడం వల్ల ఇమ్మిగ్రేషన్ సమస్యలు, డిటెన్షన్, జరిమానాలు ఎదురయ్యే ప్రమాదం ఉన్నందున నివారించాల్సిందిగా సూచించారు. మణిపూర్, అసోం, త్రిపుర వంటి ఈశాన్య రాష్ట్రాలను ప్రత్యేకంగా పేర్కొన్నారు. అక్కడ భద్రతా పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయని హెచ్చరిక జారీ చేశారు. కాగా, భారత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఈ ట్రావెల్ అడ్వైజరీ ఉంది. అంతర్జాతీయ దృష్టిలో భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు సురక్షితం కాదు అనే ధోరణిలో అమెరికా అడ్వైజరీ ఉంది. అంతేకాదు, పాకిస్థాన్ సైన్యాధిపతికి స్వయంగా వైట్‌హౌస్‌లో లంచ్‌కు ట్రంప్ ఆహ్వానించారు. అమెరికాతో సైనిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా అసిమ్ మునీర్ ఆ దేశంలో ఐదు రోజుల పర్యటించారు. భారత్ మిత్రదేశం అంటూనే పాక్‌ కూడా తమకు స్నేహితుడే అంటూ అమెరికా సన్నాయి నొక్కులు నొక్కుతుంది. ఈ నేపథ్యంలో భారత్ విషయంలో అమెరికా ఇంకెలాంటి నిర్ణయాలు తీసుకుంటోందో కాలమే నిర్ణయిస్తుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa