జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గాం బైసరన్ లోయలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ కీలక పురోగతి సాధించింది. ఈ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులు పాకిస్థాన్ పౌరులే అని, వారు నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా (LeT) కు చెందినవారేనని ఎన్ఐఏ నిర్ధారించింది. ఈ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దర్ని తాజాగా అరెస్ట్ చేసినట్టు తెలిపంది. పహల్గామ్కు చెందిన పర్వేజ్ అహ్మద్ జోథర్ (బట్కోట్), బషీర్ అహ్మద్ జోథర్ (హిల్ పార్క్) ఉగ్రవాదులకు ఆశ్రయం, ఆహారం, సాయుధ వసతులు కల్పించినట్టు విచారణలో వెల్లడైంది. ‘హిల్ పార్క్ ప్రాంతంలోలో దాడికి ముందు ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదులకు ఉద్దేశపూర్వకంగా ఆశ్రయం ఇచ్చారు’ అని NIA తెలిపింది. అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) సెక్షన్ 19 కింద ఈ ఇద్దరిని అరెస్టు చేశారు.
పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్.. పాక్తో చేసుకున్న సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. దీనికి ప్రతిగా పాక్ కూడా సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది. అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. అలాగే, జమ్మూ కశ్మీర్ నుంచి పాకిస్థాన్కు పారిపోయి.. అక్కడి నుంచి ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తోన్న ఇద్దరు ఆస్తులను కోర్టు ఆదేశాలతో పోలీసులు సీజ్ చేశారు. 2003లో మహమ్మద్ షఫీ బారా, జీ హెచ్ ముస్తాఫాలు హంద్వారాలో ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో వారి ఆస్తులను సీజ్ చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. జమ్మూ కశ్మీర్తో పాటు పాక్ సరిహద్దు ప్రాంతంలో ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తున్న వీమహమ్మద్ షఫీ బారా, జీ హెచ్ ముస్తాఫాలుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వీరిద్దరిపై చాలా సంవత్సరాలుగా కోర్టులో విచారణ జరుగుతోంది. జూన్ 20న కోర్టు తీర్పును వెలువరించింది. వారి ఆస్తులను సీజ్ చేయాలని జమ్మూ కశ్మీర్ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు షఫీ బారా, ముస్తాఫాల ఆస్తులను సీజ్ చేశారు. వీరు చాలా కాలంగా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఉగ్రవాద చర్యల్లో వీరిద్దరి ప్రమేయం ఉందని కూడా చెబుతున్నారు.
ఇదిలా ఉండగా ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. ఈ దాడికి తామే బాధ్యులమని లష్కరే తొయిబా అనుబంధ సంస్థ 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' ప్రకటించింది. దీంతో ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని భారత్ భావించింది. దౌత్యపరమైన ఆంక్షలతో పాటు ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత పాకిస్థాన్ సరిహద్దు వెంబడి ఉన్న రాష్ట్రాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. అయితే భారత్ వాటిని తిప్పికొట్టింది. భారత సైన్యం పాకిస్థాన్ ఎయిర్బేస్లపై దాడులు చేయడంతో పాక్ వెనక్కి తగ్గింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మే 10 జరగడంతో ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa