ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం మరోసారి భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జూన్ 24న నిబంధనలకు విరుద్ధంగా, మునుపెన్నడూ లేని విధంగా నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల రూపంలో బాండ్ల జారీకి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన పలు కీలక అంశాలను లేవనెత్తుతూ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు.రాష్ట్ర శాసనసభ ఆమోదం లేకుండా రాష్ట్ర ఖజానా నుంచి నిధుల ఉపసంహరణకు వీలు కల్పిస్తూ, ప్రైవేటు పార్టీలకు రాష్ట్ర సంచిత నిధి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ది స్టేట్)ని అందుబాటులోకి తెస్తున్నారని జగన్ ఆరోపించారు. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 203, 204లను పూర్తిగా ఉల్లంఘించడమేనని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, రాష్ట్ర సంచిత నిధిని హామీగా చూపి ఏపీఎండీసీ రుణాలు సేకరించడానికి అనుమతించడం ఆర్టికల్ 293(1)కి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.ఏపీఎండీసీకి భవిష్యత్తులో వచ్చే ఆదాయం మొత్తంపైనా బాండ్ హోల్డర్లకు ప్రత్యేక హక్కు కల్పించారని, దీనికి అదనంగా సుమారు రూ.1,91,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఖనిజ సంపదను కూడా ఎన్సీడీ బాండ్ హోల్డర్లకు తాకట్టు పెడుతున్నారని జగన్ ఆరోపించారు. ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.ఈ వ్యవహారంపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు విచారణలో ఉందని, దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ప్రతివాదులందరికీ కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు కూడా జారీ చేసిందని జగన్ గుర్తు చేశారు. విషయం న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పుడు, ప్రభుత్వం ఏపీఎండీసీని బాండ్ల జారీకి అనుమతించడం ఎంతమాత్రం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు."రాష్ట్ర భవిష్యత్తును, భారత రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వం వ్యవహరించడం తీవ్ర విచారకరం" అంటూ వైసీపీ అధినేత జగన్ తన ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa