కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులు, అరెస్టులకు, లాఠీచార్జీలకు వైయస్ఆర్సీపీ శ్రేణులు భయపడరని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి హెచ్చరించారు. సోమవారం నరసరావుపేటలో నిర్వహించిన యవత పోరు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. `నరసరావుపేటలో శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే దారుణంగా పోలీసులు లాఠీఛార్జ్ చేశారు, పల్నాడు జిల్లా పర్యటనలో మా అధినేత వైయస్ జగన్ పై తప్పుడు కేసు పెట్టారు, మీరు లాఠీఛార్జ్ చేసినా ఎవరూ భయపడరు. మా యువత కదం తొక్కితే తట్టుకోలేకపోయారా, అన్యాయం చేసిన పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండాలి, వైయస్ జగన్ సైన్యం ఎక్కడా భయపడకుండా పోరాడింది, కానీ పారిపోలేదు. నాడు అట్టడుగు వర్గాల వారికి కూడా రిజర్వేషన్లు కల్పిస్తే ఉన్నతంగా చదువుకుని సమాజంలో ముందుకువెళతారని మహానుభావులు రిజర్వేషన్లు కల్పించారు, డాక్టర్ వైయస్ఆర్ ఫీజు రీఇంబర్స్మెంట్ తీసుకొచ్చి పేదలను ఉన్నత విద్య వైపు నడిపించారు, కానీ చంద్రబాబు దానిని తుంగలో తొక్కారు, తర్వాత వైయస్ జగన్ ఎంత ఫీజులు ఉంటే అంత తమ ప్రభుత్వమే చెల్లించి చదివించి విద్యారంగాన్ని అభివృద్ది చేశారు, ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ సీఎం కాగానే విద్యావ్యవస్ధను సర్వనాశనం చేశారు, అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి పేదలకు విద్యను దూరం చేస్తున్నారు. ఉద్యోగం వచ్చింది పవన్ కళ్యాణ్కు నారా లోకేష్కు, ఒకరు డిప్యూటీ సీఎం,మరొకరు మంత్రి అయ్యారు. చంద్రబాబు మీరు రెండు ఎకరాల నుంచి యాభై వేల కోట్లు సంపాదించారు, ఇప్పుడు పీ 4 అంటున్నారు, మీరు ముందు కుటుంబానికి రూ. 10 లక్షలు ఇచ్చి ఇతరులకు ఆదర్శంగా ఉంటే వారు కూడా మీ బాట అనుసరిస్తారు. ఏది ఏమైనా వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి, నిరుద్యోగులకు గత ఏడాది ఇవ్వాల్సిన రూ. 36 వేలు, ఈ ఏడాది రూ. 36 వేలతో కలిపి వెంటనే విడుదల చేయాలి` అని కాసు మహేష్రెడ్డి డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa