వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. పల్నాడు జిల్లా పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతి విషయంలో.. వైఎస్ జగన్ మీద పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ప్రభుత్వంపై.. వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ వ్యవహారం ఇలా నడుస్తున్న సమయంలోనే వైఎస్ జగన్ మీద మరో కేసు నమోదైంది. మిర్చి రైతులు మద్దతు ధర లేక నష్టపోతున్నారంటూ ఫిబ్రవరి నెలలో వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డులో పర్యటించిన సంగతి తెలిసిందే.
అయితే వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో.. వైసీపీ నేతలు అనుమతి లేకుండా గుంటూరు మిర్చి యార్డు పర్యటనకు వెళ్లారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్తో పాటుగా మాజీ మంత్రి అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, మోదుగల వేణుగోపాల్రెడ్డి, కావటి మనోహర్ నాయుడులపై కేసు నమోదైంది. వైసీపీ నేతలకు 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. విచారణ కోసం పిలిచినప్పుడు నల్లపాడు పోలీస్ స్టేషన్కు రావాలని పోలీసులు నోటీసుల్లో స్పష్టం చేశారు.
ఫిబ్రవరి 19న వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డును సందర్శించారు. మిర్చి రైతులను పరామర్శించారు. అయితే ఆ సమయంలో గుంటూరు - కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. కోడ్ నేపథ్యంలో భారీ ర్యాలీలకు అనుమతి ఉండదు. కానీ వైఎస్ జగన్.. వైసీపీ శ్రేణులతో కలిసి అనుమతి లేకుండానే మిర్చి యార్డుకు వచ్చారని కేసు నమోదైంది.
కేసు విచారణలో భాగంగానే పలువురు వైసీపీ నేతకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. పిలిచినప్పుడు విచారణకు రావాలని నల్లపాడు పోలీసులు నోటీసుల్లో పేర్కొంటున్నారు. అయితే వైఎస్ జగన్కు కూడా నోటీసులు ఇస్తారా అనేది ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు వైఎస్ జగన్ మిర్చి యార్డు పర్యటన సమయంలో ఆగంతకులు కొన్ని మిర్చి బస్తాలను ఎత్తుకెళ్లారనే ఆరోపణలు వచ్చాయి.
వైఎస్ జగన్ మీద ఇప్పటికే సింగయ్య మృతికి సంబంధించి కేసు నమోదైంది. వైఎస్ జగన్ కారు కిందపడే సింగయ్య చనిపోయారని గుంటూరు పోలీసులు చెప్తున్నారు. దీనిపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇలాంటి సమయంలో జగన్ మీద మరో కేసు నమోదు కావటం ప్రాధాన్యం సంతరించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa