ఎయిరిండియా విమాన ప్రమాదం నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దేశవ్యాప్తంగా విమానయాన భద్రతపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో పలు ప్రధాన విమానాశ్రయాల్లో విమానయాన వ్యవస్థల్లో అనేక లోపాలు ఉన్నట్లు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. విమానాలు, రన్వేలు సహా పలు కీలక విభాగాల్లో ఈ సమస్యలు ఉన్నాయని డీజీసీఏ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.డీజీసీఏ జాయింట్ డైరెక్టర్ జనరల్ నేతృత్వంలోని రెండు ప్రత్యేక బృందాలు ఇటీవల ఢిల్లీ, ముంబై వంటి దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో సమగ్రమైన తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో భాగంగా ఫ్లైట్ ఆపరేషన్స్, ర్యాంప్ సేఫ్టీ, ఏయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ అండ్ నేవిగేషన్ పరికరాలు, విమానం ఎక్కే ముందు సిబ్బందికి నిర్వహించే వైద్య పరీక్షలు ప్రీ-ఫ్లైట్ మెడికల్ ఎవాల్యూయేషన్స్ వంటి అనేక కీలక అంశాలను నిశితంగా పరిశీలించినట్లు అధికారులు తెలిపారు.ఈ తనిఖీల్లో అనేక ఆందోళనకరమైన విషయాలు బయటపడ్డాయి. ఒక విమానాశ్రయంలో, అరిగిపోయిన టైర్ల కారణంగా ఒక దేశీయ విమానం నిలిచిపోయిన ఉదంతాన్ని అధికారులు గుర్తించారు. కొన్ని సందర్భాల్లో విమానాల్లోని లోపాలు పదేపదే పునరావృతమవుతున్నాయని డీజీసీఏ పేర్కొంది. అంతేకాకుండా, ఒకచోట శిక్షణకు ఉపయోగించే సిమ్యులేటర్ వాస్తవ విమాన కాన్ఫిగరేషన్కు అనుగుణంగా లేదని, దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ కూడా తాజా వెర్షన్కు అప్డేట్ చేయలేదని గుర్తించినట్లు వెల్లడించింది. ఇటువంటి లోపాలు పటిష్టమైన పర్యవేక్షణ లేమిని, సమస్యల పరిష్కారంలో ఉదాసీనతను స్పష్టం చేస్తున్నాయని డీజీసీఏ అభిప్రాయపడింది.లోపాలు ఉన్న విమానయాన సంస్థలు లేదా ఇతర విభాగాల పేర్లను డీజీసీఏ ప్రస్తుతానికి బయటపెట్టలేదు. అయితే, గుర్తించిన లోపాలన్నింటినీ సంబంధిత సంస్థల దృష్టికి తీసుకెళ్లామని, తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు డీజీసీఏ స్పష్టం చేసింది. విమాన ప్రయాణాల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఈ విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని అధికారులు తెలిపారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa