ఏపీలో టీడీపీ కూటమి పాలనకు ఏడాది పూర్తైన నేపథ్యంలో.. ఇక ప్రభుత్వంపై పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సూపర్ సిక్స్ హామీలను సీఎం నారా చంద్రబాబు నాయుడు అమలు చేయకుండా.. డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నా్రంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జిలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీలు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోవడాన్ని ప్రజల్లో ఎండగడుతూ..‘రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో’ పేరుతో 5 వారాల కార్యక్రమం చేపట్టాలని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ ఆవిష్కరించారు. ఏడాదిలోనే ప్రభుత్వంపై ఈ స్థాయిలో వ్యతిరేకత ఎప్పడూ చూడలేదని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు ప్రజలకు మంచి చేయాల్సింది పోయి.. ప్రజలను తప్పు దోవ పట్టించాలని చూస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం మధ్య స్పష్టంగా తేడా కనిపిస్తోందని.. వైసీపీ 5 ఏళ్ల పాలనలో వివక్ష లేకుండా పథకాలు అమలు చేశామని వైఎస్ జగన్ అన్నారు. టీడీపీ కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. చంద్రబాబు ఏడాది కాలం పాలనలో మోసం, దగా తప్ప ఏమీ లేదన్న వైఎస్ జగన్.. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీని కూడా అమలు చేయలేదన్నారు. ఈ నేపథ్యంలోనే రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమం చేపడుతున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. చంద్రబాబు ఏడాది పాలనలో ప్రతి కుటుంబానికి జరిగిన నష్టం ఎంత? ఇంకా ఎంత నష్టం జరుగుతోంది.. వైసీపీ ప్రభుత్వం ఉండి ఉంటే, ఎంత ప్రయోజనం ఉండేదో ప్రజలకు వివరించాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
చంద్రబాబు మ్యానిఫెస్టోలో ఏం చెప్పారు? ఇప్పుడెలా మోసం చేస్తున్నారనదే దానిపై గ్రామ గ్రామాన, రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో పేరుతో కార్యక్రమం చేపట్టాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు చంద్రబాబు.. జగన్ చేస్తున్నవే కాకుండా. అంతకు మించి ఇస్తానన్నారని.. ప్రతి ఇంటికి టీడీపీ నాయకులు, కార్యకర్తలను పంపించి.. ఆ కుటుంబంలో ఎవరెవరికి ఏ పథకం వర్తిస్తుంది. దాని వల్ల ఎంతెంత ప్రయోజనమో చెప్తూ బాండ్లు పంచారని వైఎస్ జగన్ అన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి కింద ఇంతింత వస్తుందంటూ బాండ్లు పంచారని.. వాటిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలు కూడా చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు.
బాండ్లు ఇచ్చి, ప్రలోభాలు పెట్టి, పచ్చి మోసం చేశారన్న వైఎస్ జగన్.. అవన్నీ ఇప్పుడు రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమం ద్వారా ప్రజల్లో ప్రస్తావించాలని వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఐదు వారాల పాటు జరిగే ఈ కార్యక్రమం కోసం వైసీపీ క్యూఆర్ కోడ్ కూడా ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్లు. పార్టీ జిల్లా అధ్యక్షులు.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు. ఆ తర్వాత రెండు బటన్లు నొక్కితే, చంద్రబాబు నాయుడు మ్యానిఫెస్టో, బాండ్లు వస్తాయి. మరో బటన్ నొక్కితే, ఒక్కో కుటుంబం ఎంత మేరకు నష్టపోయిందో వస్తుంది. రెండో దశలో నియోజకవర్గ స్థాయిలో, మూడో దశలో మండల స్థాయిలో ఈ కార్యక్రమం ఉంటుంది.
నాలుగో దశలో గ్రామస్థాయిలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని.. అందరికీ అర్థమయ్యేలా వివరించాలని వైఎస్ జగన్ సూచించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత.. ప్రజాగళం. సూపర్సిక్స్ హామీలతో పాటుగా.. చంద్రబాబు చేసిన మోసం వివరాలు వస్తాయన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు పంచిన బాండ్లు సిద్ధంగా ఉంచుకోవాలని పార్టీ కార్యకర్తలకు వైఎస్ జగన్ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa