హిమాచల్ ప్రదేశ్లోని కుల్లు జిల్లాలో సంభవించిన క్లౌడ్ బరస్ట్ తీవ్ర వరదలు, భారీ నష్టానికి కారణమైంది. సైంజ్, గడ్సా, సోలాంగ్ నాలా ప్రాంతాల్లో 3 క్లౌడ్ బరస్ట్ ఘటనలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. వీటి కారణంగా జీవా నాలా ప్రవాహం ఒక్కసారిగా పెరిగిందని.. దీంతో సమీప ప్రాంతాలకు స్థానిక అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. నదులు, వాగులు ఉప్పొంగి కుల్లు జిల్లా అంతటా భారీ వరదలు సంభవించాయి. కుల్లు జిల్లా ప్రధాన కార్యాలయాన్ని కలిపే కీలక రహదారి అయిన.. ఆట్-లుహ్రీ-సైంజ్ నేషనల్ హైవే మూతపడడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
వన్యార్లో షెడ్యూల్ చేసిన వివిధ కార్యక్రమాల కోసం వెళ్లిన ఇద్దరు మంత్రులు.. అక్కడే చిక్కుకుపోయారు. హిమాచల్ ప్రదేశ్ వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రొఫెసర్ చందర్ కుమార్.. ఆ రాష్ట్ర సాంకేతిక విద్య, వృత్తి, పారిశ్రామిక శిక్షణ శాఖ మంత్రి రాజేష్ ధర్మాని.. జాతీయ రహదారి మూసుకుపోవడంతో అక్కడే నిలిచిపోయారు.
ఈ క్రమంలోనే వరల్డ్ హెరిటేజ్ ఫెస్టివల్ 2025కు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన మంత్రి రాజేష్ ధర్మాని అక్కడే చిక్కుకుపోవడంతో ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. క్లౌడ్ బరస్ట్కు సంబంధించిన వివరాలను హిమాచల్ ప్రదేశ్ విపత్తు నిర్వహణ డైరెక్టర్ డీసీ రాణా వెల్లడించారు. పార్వతి నది కూడా ఉప్పొంగుతోందని తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం లేదని వివరించారు.
అయితే ముందు జాగ్రత్తగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం చేయడానికి ప్రభుత్వం రెండు టోల్-ఫ్రీ హెల్ప్లైన్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు డీసీ రాణా తెలిపారు. మరోవైపు.. రాబోయే 48 గంటల్లో హిమాచల్ ప్రదేశ్లో అత్యంత భారీ వర్షపాతం కురుస్తుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడమే కాకుండా ఆరెంజ్ అలర్ట్ కూడా విధించింది.
కాంగ్రా, మండి, సిమ్లా, సిర్మౌర్, కుల్లు, హమీర్పూర్, సోలన్, ఉనా జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వర్షాలు కొనసాగుతున్నందున.. మరింత వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని స్థానిక అధికారులు హై అలర్ట్లో ఉండాలని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa