ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీవు లేకుంటే ఇవేవీ ముఖ్యం కావంటూ..భార్యను ఉద్దేశిస్తూ శుభాన్షు శుక్లా ఎమోషనల్ పోస్ట్

national |  Suryaa Desk  | Published : Wed, Jun 25, 2025, 08:45 PM

భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. మన దేశం నుంచి రెండో వ్యోమగామిగా శుభాన్షు శుక్లా రోదసి యాత్రకు వెళ్లారు. అయితే ఈ ప్రయాణానికి ముందే ఆయన తన భార్య కోసం ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ముఖ్యంగా ఆయన చెప్పిన మాటలు అందరి గుండెలను తాకుతున్నాయి. ముఖ్యంగా నీవు లేకపోతే ఇవీవీ ముఖ్యం కావంటూ ఆయన చెప్పిన తీరు.. అతడికి భార్య ఎంత ప్రేమ ఉందో చూపిస్తోంది. స్పేస్‌ఎక్స్ గన్ వ్యోమనౌకలో ఇతర దేశాల వ్యోమగాములతో కలిసి ఆయన బుధవారం రోజు మధ్యాహ్నం 12:01 గంటలకు అంతరిక్షంలోకి బయలుదేరారు.


ఈ యాత్ర మొదట మే 29న ప్రారంభం కావాల్సి ఉండగా.. వాతావరణ పరిస్థితులు, సాంకేతిక సమస్యల కారణంగా ఆరుసార్లు వాయిదా పడింది. ఈ సుదీర్ఘ నిరీక్షణ కాలంలో ప్రయోగానికి కొన్ని గంటల ముందు శుభాన్షు శుక్లా తన భార్య కామ్నా శుభాను ఉద్దేశించి ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. సాధారణంగా అంతరిక్షంలోకి వెళ్లే ముందు వ్యోమగాములను ప్రత్యేకంగా ఉంచుతారు. శుభాన్షు శుక్లా కూడా కొన్ని రోజులు ఒంటరిగా గడిపారు. ఈ ఒంటరితనం, రాబోయే యాత్రకు సంబంధించిన ఉత్కంఠ మధ్య ఆయన తన మనసులోని మాటలను పంచుకున్నారు.


 జూన్ 25న ఉదయం మనం భూమిని విడిచి వెళ్తున్నాము. ఈ మిషన్‌కు సహకరించిన ప్రతి ఒక్కరికీ, నా శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. నా కుటుంబానికి, స్నేహితులకు ప్రత్యేక కృతజ్ఞతలు. వారు నాకు ఎంతో అండగా నిలిచారు. కొన్నిసార్లు మీ దగ్గరి వాళ్లు మీ కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. వాటిని మీరు పూర్తిగా అర్థం చేసుకోలేరు. కానీ వారు అలా చేస్తారంటే అది వారి ప్రేమను తెలియజేస్తుంది" అని శుక్లా తన పోస్టులో పేర్కొన్నారు.


ప్రత్యేకించి తన భార్య గురించి ప్రస్తావిస్తూ, "@kamnashubha నీవు నాకు ఒక అద్భుతమైన జీవిత భాగస్వామివి. నీకు ప్రత్యేక ధన్యవాదాలు" అని అన్నారు. శుక్లా మరియు ఆయన భార్య ఒక గాజు అద్దం ద్వారా వేరుగా ఉన్న చిత్రాన్ని కూడా ఆ పోస్టులో పెట్టారు. ఇది వారి మధ్య బంధం ఎంత బలమైందో, ఈ ప్రయాణంలో వారి త్యాగాలు ఎంత గొప్పవో కళ్లకు కట్టినట్లు చూపింది. "నీవు లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు. అంతేకాదు ఇది నాకు సంతోషాన్ని కూడా ఇచ్చేది కాదు.." అని శుక్లా పలికిన మాటలు ఎందరినో కదిలించాయి. అలాగే "ఎవరూ అంతరిక్షంలోకి ఒంటరిగా వెళ్లరు. మన వెనుక ఎంతోమంది ఉంటారు. వారందరికీ నేను కృతజ్ఞుడను. ధన్యవాదాలు" అని ఆయన తన పోస్ట్‌ను ముగించారు.


Ax-4 మిషన్ సిబ్బంది రెండు వారాల పాటు అంతరిక్షంలో ఉంటారు. రాకేష్ శర్మ 1984లో అంతరిక్షంలోకి వెళ్లిన దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం అంతరిక్షంలోకి వెళ్తున్న రెండో భారతీయుడు శుభాన్షు శుక్లా కావడం దేశానికి గర్వకారణం. వ్యోమగాములకు ప్రయోగానికి ముందు శిక్షణతో పాటు తిరిగి వచ్చాక భూమి వాతావరణానికి అలవాటు పడటానికి కూడా సమయం పడుతుంది. ఈ మిషన్ విజయవంతం కావాలని, శుభాన్షు శుక్లా సురక్షితంగా తిరిగి రావాలని దేశ ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa