తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై జిల్లాలోని పడవేడు గ్రామానికి చెందిన 65 ఏళ్ల మాజీ సైనికాధికారి విజయన్.. ఆయన భార్య కస్తూరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కొంతకాలం క్రితమే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రాగా.. ప్రస్తుతం వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఈ కలహాల నేపథ్యంలో విజయన్ తీసుకున్న ఒక నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా ఆయన తన కుటుంబానికి చెందిన రూ.4 కోట్ల విలువైన ఆస్తి పత్రాలను పడవేడులోని ప్రసిద్ధ రేణుకాంబాల్ ఆలయ హుండీలో వేశారు.
ఈ విషయం తెలుసుకున్న విజయన్ భార్య కస్తూరి, వారి కుమార్తెలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భవిష్యత్తుకు ఆధారం అయిన ఆస్తి పత్రాలు హుండీలో వేయడంతో.. ఏం చేయాలో పాలుపోక ఆలయ అధికారుల వద్దకు చేరుకున్నారు. వాటిని ఎలాగైనా సరే తిరిగి ఇచ్చేయమంటూ.. రేణుకాంబాల్ ఆలయ సిబ్బందిని కోరుతున్నారు. తమ ఇంట్లో జరుగుతున్న గొడవల కారణంగానే.. కోపంలో ఉన్న తండ్రి ఈ పని చేశాడని వేడుకుంటున్నారు. తండ్రి తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం వల్ల తాము తీవ్రంగా నష్టపోతామంటూ ఆలయ అధికారుల ముందు కన్నీరు పెట్టుకున్నారు.
అయితే ఆలయ నిబంధనల ప్రకారం హుండీలో వేసిన వస్తువులను తిరిగి ఇవ్వడం అంత సులువు కాదు. ఈ నేపథ్యంలోనే ఆలయ అధికారులు విజయన్ భార్య, కుమార్తెల విజ్ఞప్తిని ఆలయ ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. హుండీలో వేసిన ఆస్తి పత్రాలను తిరిగి ఇవ్వడంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. కుటుంబ కలహాలు ఎంతటి అనాలోచిత నిర్ణయాలకు దారితీస్తాయో, ఒక కుటుంబ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో ఈ ఘటన తెలియజేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa