ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ సైన్యానికి గట్టి షాక్.. అభినందన్‌ వర్థమాన్‌ను పట్టుకున్న మేజర్ మృతి

international |  Suryaa Desk  | Published : Wed, Jun 25, 2025, 09:47 PM

భారత వైమానిక దళ పైలట్ అభినందన్ వర్థమాన్‌ను 2019లో పాకిస్థాన్ సైన్య అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈయన అరెస్టులో కీలక పాత్ర వహించిన పాకిస్థాన్ సైనిక అధికారి మేజర్ మొయిజ్ అబ్బాస్ షా కూడా అందరికీ గుర్తుండే ఉంటారు. తాజాగా ఆయన తాలిబన్ ఉగ్రవాదులతో జరిగిన ఘర్షణలో మృతి చెందారు. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూంఖ్వా ప్రాంతంలో తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) ఉగ్రవాదులతో జరిగిన ఈ భీకర పోరాటంలో మేజర్ మొయిజ్ అబ్బాస్ షా ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి.


2019లో భారత్ చేపట్టిన బాలాకోట్ వైమానిక దాడుల అనంతరం.. పాకిస్థాన్ సైన్యం ప్రతీకార వైమానిక ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలోనే భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్థమాన్ పాక్ సైన్యానికి చిక్కారు. ఆ సంఘటనలో అభినందన్‌ను పట్టుకున్న వారిలో మేజర్ మొయిజ్ అబ్బాస్ షా ఒకరు. అభినందన్ పాక్ సైన్యం అధీనంలో ఉన్నప్పుడు ఆయనతో వ్యవహరించిన తీరు, ఆనాటి దృశ్యాలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆ ఘటన తర్వాత కొద్ది రోజుల్లోనే అభినందన్‌ను పాకిస్థాన్ భారత్‌కు తిరిగి అప్పగించింది.


 అభినందన్ కేసుతో ఆయనకు ఉన్న సంబంధం కారణంగా మేజర్ మొయిజ్ అబ్బాస్ షాకు భారతీయులు అందరికీ తెలిశారు. ముఖ్యంగా ఆ వీడియోలో ఈయన కూడా కనిపించగా.. అంతా ఈయన్ను బాగా గుర్తు పెట్టుకున్నారు. కేవలం 37 ఏళ్ల వయసు ఉన్న ఈయన తాజాగా తాలిబన్ ఉగ్రవాదులతో జరిగిన పోరులో ప్రాణాలు కోల్పోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా మొయిజ్ అబ్బాస్ షా ప్రస్తుతం ఎలైట్ స్పెషల్ సర్వీస్ గ్రూపులో పని చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఉగ్రవాద నిరోదక ఆపరేషన్ చేపడుతున్న సమయంలో ఉగ్రవాదులు ఎదురు కాల్పులు జరిపారు. ఈక్రమంలోనే ఆయన చనిపోయారు. అలాగే ఈ దాడుల్లో 11 మంది ఉగ్రవాదులు సహా లాన్స్ నాయక్ జిబ్రినుల్లా అనే మరో సైనికుడు కూడా మృతి చెందారు.


ఖైబర్ పఖ్తూంఖ్వా ప్రాంతం పాకిస్థాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు కీలక కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతంలో పాకిస్థాన్ సైన్యం తరచుగా TTP ఉగ్రవాదులతో పోరాడుతూనే ఉంటుంది. ఈ పోరాటాలలో పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోవడం సర్వసాధారణం అయినప్పటికీ.. అభినందన్ కేసుతో సంబంధం ఉన్న ఒక ఉన్నతాధికారి మృతి చెందడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈయన మృతి పాకిస్థాన్ సైన్యానికి తీరని లోటుగా భావిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa