ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆపరేషన్ సిందూర్ వేళ పాక్ టార్గెట్లను ఫిక్స్ చేసిన ఇండియన్ నేవీ.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 27, 2025, 07:53 PM

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వైమానిక దళం పాకిస్తాన్‌కు చుక్కలు చూపించడమే కాదు.. భారత నౌకాదళం కూడా విధ్వంసక దాడికి దాదాపు సిద్ధమైంది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకపు పర్యాటకులను పొట్టనబెట్టుకున్నందుకు ప్రతీకారంగా.. మే 6, 7 తేదీల్లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై వైమానిక, క్షిపణి దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులను భారత్ మట్టుబెట్టింది. అంతేకాకుండా పాకిస్తాన్ వైమానిక స్థావరాలను, దాని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను క్షిపణులను ఉపయోగించి ధ్వంసం చేసింది. అయితే ఇదే సమయంలో మరిన్ని భారీ దాడుల నుంచి పాకిస్తాన్ తృటిలో తప్పించుకుందని తాజాగా వెల్లడైంది.


ఆపరేషన్ సిందూర్ వేళ భారత నేవీ కూడా పాకిస్తాన్‌పై దాడికి దాదాపుగా సిద్ధమైంది. ఎక్కడ దాడి చేయాలి అనేదానిపై నేవీకి కూడా నిర్దిష్ట సూచనలు చేశారు. పాకిస్తాన్ లోపల లక్ష్యాలపై, ఉపరితలం నుంచి ప్రయోగించే క్షిపణులను ప్రయోగించేందుకు నేవీ హాట్ స్టాండ్‌బైలో ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ లక్ష్యాల్లో పాకిస్తాన్ నేవీకి చెందిన షిప్‌లు, సబ్‌మెరైన్‌లు, కరాచీ పోర్టు వంటివి ఉన్నాయని తెలిపాయి. అయితే చివరి నిమిషంలో నేవీ చేసే దాడులకు తుది ఆదేశాలు రాకపోవడంతో పాకిస్తాన్ భారీ నష్టం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది.


ఒకవేళ భారత నేవీకి ఆదేశాలు వచ్చి ఉంటే.. కరాచీ పోర్టులోని పాకిస్తాన్ నేవీ నౌకలతో సహా పాకిస్తాన్‌లోనే వ్యూహాత్మక లక్ష్యాలపై బ్రహ్మోస్ క్షిపణులు, జలాంతర్గాముల నుంచి ప్రయోగించే ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైళ్లతో దాడులు జరిగేవని తెలుస్తోంది. భారత యుద్ధ నౌకలు, జలాంతర్గాములు రెండూ కూడా యాంటీ షిప్, ల్యాండ్ అటాక్ క్షిపణులతో సిద్ధంగా ఉన్నాయి.


ఆ సమయంలో పాకిస్తాన్ నేవీకి చెందిన కీలక యుద్ధ నౌకలు, కార్వెట్స్ సహా అనేక ముఖ్యమైన ఆస్తులు కరాచీ పోర్టులోనే చిక్కుకుపోయాయి. భారత నేవీకి ఆదేశాలు లభించి ఉంటే.. ఓడరేవుతో సహా పాకిస్తాన్ నేవీకి తీవ్ర నష్టం వాటిల్లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉత్తర అరేబియా సముద్రంలో భారత్ ఐఎన్ఎస్ విక్రాంత్‌తో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఐఎన్ఎస్ విక్రాంత్ క్యారియర్ యుద్ధ సమూహం, దానిలోని మిగ్-29కే ఫైటర్ జెట్‌లు పాకిస్తాన్ దక్షిణ తీరానికి దూరంగా గగనతలంలో పూర్తి నియంత్రణను కలిగి ఉన్నాయి.


ఆపరేషన్ సిందూర్ ముగిసిన కొన్ని రోజుల తర్వాత.. ఒక పాకిస్తాన్ నేవీకి చెందిన ఆర్ఏఎస్-72 సీ ఈగల్ అనే ఏటిఆర్-72 టర్బో ప్రాప్ ఎయిర్‌క్రాఫ్ట్ భారత ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ సమూహం ద్వారా ట్రాక్ చేయబడింది. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి బయలుదేరిన భారత నేవీ మిగ్-29కే జెట్.. పాకిస్తాన్ నేవీ విమానానికి కొన్ని వందల మీటర్ల దూరంలోనే తనను తాను నిలబెట్టుకుని, పాక్ విమానాన్ని తిరిగి తీరానికి వెళ్లమని ఒత్తిడి చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa