ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్యను చంపి బస్సులో మృతదేహం పంపిన వృద్ధుడు

Crime |  Suryaa Desk  | Published : Fri, Jun 27, 2025, 07:54 PM

తప్పు చేసిన వారు ఎప్పటికై శిక్ష అనుభవించాల్సిందే అనేది మనం తరచూ వినే సూక్తి. అలాగే ఆలస్యంగా దక్కిన న్యాయం అసలు న్యాయమే కాదని కూడా చాలా సార్లు వినే ఉంటాం. ఈ రెండూ పూర్తిగా భిన్నమైనవి. తప్పు చేసి తప్పించుకున్న నిందితుడు ఓ 20, 30 సంవత్సరాలు తన జీవితాన్ని ఎంజాయ్ చేసి చివరికి ముసలి వయస్సులో దొరికి తన జీవితపు చివరి రోజులను జైలులో గడిపినంత మాత్రాన.. ఆ బాధితులకు న్యాయం జరిగిందని ఎలా చెప్పగలం. అచ్చంగా ఇలాంటి ఓ కేసు తాజాగా కర్ణాటకలో వెలుగు చూసింది. భార్యను చంపిన ఓ భర్త పోలీసులకు దొరకకుండా ఒకటి, రెండు కాదు, ఏకంగా 20 ఏళ్లు తప్పించుకు తిరిగాడు. కానీ చివరికి ముసలి వయస్సులో పోలీసులకు చిక్కాడు. 49 ఏళ్ల వయస్సులో హత్య చేయగా, 75 ఏళ్ల వయస్సులో పోలీసులకు దొరికాడు.


వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందిన దేవిదార నాయక్ (75) అనే వ్యక్తి, 20 ఏళ్ల క్రితం తన భార్య దేవికను చంపిన కేసులో నిందితుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దేవిదార నాయక్ తన భార్యను ఇంట్లోనే గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత, ఎవరికీ అనుమానం రాకుండా, ఆమె శవాన్ని ఒక పెద్ద బ్యాగులో కుక్కి, మాండ్యకు వెళ్లే ఒక ప్రైవేట్ బస్సులో ఎక్కించాడు. డ్రైవర్‌కు, 'నా భార్య మాండ్యలో దిగుతుంది, ఈ బ్యాగును ఆమెకు ఇవ్వండి' అని చెప్పి అక్కడి నుండి తప్పించుకున్నాడు.


బస్సు మాండ్యకు చేరుకున్న తర్వాత, ఎవరూ ఆ బ్యాగును తీసుకోవడానికి రాలేదు. డ్రైవర్, కండక్టర్‌కు అనుమానం రావడంతో, వారు బ్యాగును తెరిచి చూడగా, అందులో దేవిక మృతదేహం కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. అయితే, నిందితుడి ఆచూకీ తెలియకపోవడంతో కేసు ముందుకు సాగలేదు.


ఈ ఘటన జరిగి దాదాపు రెండు దశాబ్దాలు గడిచిపోయాయి. పోలీసులు ఈ కేసును ఛేదించలేకపోయినా, పాత కేసుల ఫైళ్లను తరచూ పరిశీలిస్తుంటారు. తాజాగా, ఈ పాత కేసును మరోసారి పరిశీలించిన పోలీసులు, కొన్ని కీలక ఆధారాలను సేకరించారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో దేవిదార నాయక్ ఆచూకీని తెలుసుకున్నారు. అతడు ప్రస్తుతం వేరే ప్రాంతంలో కొత్త జీవితం మొదలుపెట్టి, పెళ్లి కూడా చేసుకున్నట్లు గుర్తించారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, అతడిని అదుపులోకి తీసుకున్నారు.


పోలీసుల విచారణలో, దేవిదార నాయక్ తన నేరాన్ని అంగీకరించాడు. 'భార్యపై ఉన్న పగతోనే ఆమెను చంపి, ఇలాంటి దారుణానికి పాల్పడ్డాను' అని ఒప్పుకున్నాడు. అతడిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇరవై ఏళ్లు దాటినా, పోలీసులు కేసును ఛేదించి, నిందితుడిని పట్టుకోవడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. పాత కేసుల పట్ల పోలీసుల చిత్తశుద్ధికి, నిబద్ధతకు నిదర్శనమని స్థానికులు అంటున్నారు. తప్పు చేసిన వారు ఏనాటికైనా శిక్ష అనుభవించాల్సిందేనని ఈ ఘటన మరోసారి నిరూపించిందని పేర్కొంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa