నోయిడాలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమంగా నడుపుతున్న ఒక వృద్ధాశ్రమంపై అధికారులు దాడి చేయగా.. అత్యంత దయనీయ స్థితిలో వృద్ధులు కనిపించారు. ముఖ్యంగా అక్కడంటున్న పండుటాకుల్లో కొందరి చేతులను కట్టేసి ఉంచగా.. మరికొందరిని బేస్మెంట్ రూంలలో నిర్బంధించారు. ముఖ్యంగా అందులో చాలా మందికి ఒంటిపై బట్టలు కూడా లేవు. ఇది చాలదన్నట్లుగా శుభ్రత లేకపోవడంతో మలమూత్ర విసర్జనలతో కూడిన దుస్తులతోనే ఆ ముసలి వాళ్లు కాలం వెళ్లదీస్తూ కనిపించారు. దీంతో అందులో నిత్యం నరకం చూస్తున్న మొత్తం 42 మంది వృద్ధులను అధికారులు రక్షించారు.
ఒంటిపై బట్టలు కూడా లేని పరిస్థితుల్లో వృద్ధులు..
గురువారం నాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్, రాష్ట్ర సంక్షేమ శాఖ, స్థానిక పోలీసులతో కూడిన బృందం నోయిడా సెక్టార్ 55లోని "ఆనంద్ నికేతన్ వృధా సేవా ఆశ్రమం"పై ఆకస్మిక దాడి చేసింది. ఈ ఆశ్రమం ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా చట్టవిరుద్ధంగా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత 30 సంవత్సరాలుగా ఈ వృద్ధాశ్రమం నడుస్తున్నట్లు తెలుసుకుని విస్తుపోయినట్లు వివరించారు. మహిళా కమిషన్ సభ్యురాలు మీనాక్షి భరాలా ఆశ్రమంలోని పరిస్థితులను చూసి షాక్ అయ్యారు. వృద్ధులు అపరిశుభ్ర వాతావరణంలో, సరైన సంరక్షణ లేకుండా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. కొందరు వృద్ధులను కట్టేసి, చీకటి గదుల్లో నిర్బంధించారని, మరికొందరు సరిగా దుస్తులు కూడా లేకుండా కనిపించారని వెల్లడించారు
మొత్తంగా 42 మంది వృద్ధుల స్వాధీనం..
రక్షించబడిన 42 మంది వృద్ధులను రాష్ట్ర సంక్షేమ శాఖ స్వాధీనం చేసుకుంది. వారిలో ముగ్గురిని శుక్రవారం ప్రభుత్వ వృద్ధాశ్రమానికి తరలించారు. మిగిలిన వారిని కూడా త్వరలోనే ప్రభుత్వం ఆమోదించిన ఇతర వృద్ధాశ్రమాలకు తరలించనున్నారు. ఈ అక్రమ వృద్ధాశ్రమాన్ని వెంటనే సీజ్ చేసిన అధికారులు.. దీన్ని నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించారు.
మరోవైపు ఈ ఆశ్రమంలో చేరిన ఒక్కో వ్యక్తి నుంచి నిర్వాహకులు రూ.2.5 లక్షలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నెలవారీ ఖర్చుల నిమిత్తం అదనంగా మరికొంత మొత్తం చెల్లిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఇక్కడ చేరే వారిలో ఎక్కువ మంది నోయిడాకు చెందిన ఉన్నత కుటుంబాల తల్లిదండ్రులేనని వెల్లడించారు. ఇలాంటి దారుణాలు భవిష్యత్తులో జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తుండగా.. అధికారులు కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు మరే వృద్ధుడికీ రానీవమంటూ చెప్పుకొస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa