ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారి గుర్తింపు ప్రక్రియ ముగిసింది

national |  Suryaa Desk  | Published : Sat, Jun 28, 2025, 08:35 PM

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారి గుర్తింపు ప్రక్రియ ముగిసింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 260 అని అధికారులు అధికారికంగా ధృవీకరించారు. గుర్తు పట్టడానికి వీలులేని విధంగా ఛిద్రమైన మృతదేహాలను గుర్తించేందుకు చేపట్టిన డీఎన్‌ఏ పరీక్షలు పూర్తయ్యాయని, చివరి మృతదేహాన్ని కూడా శుక్రవారం వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని అధికారులు తెలిపారు.ఈ విషయంపై అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ జోషి మాట్లాడుతూ, "విమాన ప్రమాదానికి సంబంధించి చివరి మృతదేహం డీఎన్‌ఏ నమూనా కూడా సరిపోయింది. ఆ మృతదేహాన్ని వారి కుటుంబానికి అప్పగించాం. దీంతో మృతులందరినీ వారి కుటుంబాలకు చేర్చినట్లయింది" అని అన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన వివరించారు.జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సమీపంలోని ఒక వైద్య కళాశాల హాస్టల్ భవనంపై కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒకరు మినహా 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద స్థలంలో ఉన్న మరికొందరు కూడా మృతి చెందారు. తొలుత మృతుల సంఖ్య 270 వరకు ఉండవచ్చని అంచనా వేసినప్పటికీ, పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం ఆ సంఖ్య 260 అని అధికారులు వెల్లడించారు.మొత్తం 260 మంది మృతుల్లో 200 మంది భారతీయులు, 52 మంది బ్రిటిష్ పౌరులు, ఏడుగురు పోర్చుగల్ జాతీయులు, ఒక కెనడియన్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జూన్ 23 నాటికే 259 మృతదేహాలను గుర్తించగా, ఒక మృతదేహం గుర్తింపు మాత్రం డీఎన్‌ఏ పరీక్షల కారణంగా పెండింగ్‌లో ఉంది. తాజాగా ఆ ప్రక్రియ కూడా పూర్తి కావడంతో మొత్తం లెక్క తేలింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa