ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంఅమలుపై .. చంద్రబాబు కీలక సూచనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 28, 2025, 08:44 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో హామీ అమలుకు సిద్ధమైంది. సూపర్ సిక్స్ పథకాల అమల్లో భాగంగా ఒక్కొక్క హామీ అమలు చేస్తూ వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు మరో హామీ అమలుపై కసరత్తు ప్రారంభించింది. ఆగస్ట్ 15 నుంచి.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం సమీక్ష నిర్వహించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఈ విషయంపై సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించారు.


మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తే ఆర్టీసీ బస్సులో ఆక్యుపెన్సీ పెరుగుతుందని.. అందుకు తగినట్లుగా బస్సులు సంఖ్య పెంచుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఇందుకోసం అవసరమైతే కొత్త బస్సులు కొనడం, లేదా అద్దెకు తీసుకోవడం చేయాలని సూచించారు. అలాగే ఇక మీదట ఆర్టీసీలో ప్రవేశపెట్టే బస్సులు అన్నీ కూడా.. ఎలక్ట్రిక్ ఏసీ బస్సులే ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పుడున్న బస్సులను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే అవకాశాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. అలాగే ప్రతీ ఆర్టీసీ బస్సుకు జీపీఎస్ తప్పనిసరిగా అమర్చాలని సూచించారు.


ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే ప్రజాధనం సద్వినియోగం చేసుకోవాలని.. ప్రతీ రూపాయి విలువైనదేనని అన్నారు. ఆర్టీసీ ఆదాయ మార్గాలను పెంచుకోవాలని.. ఖర్చు ఎలా తగ్గించుకోవాలి, ఇతర మార్గాల ద్వారా ఆదాయాలను ఎలా పెంచుకోవాలనే దానిపై ఆలోచనలు చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.


బస్టాండ్లలో టాయిలెట్లు పరిశుభ్రంగా ఉంచాలని.. ఏపీఎస్ఆర్టీసీ బస్సులపై ప్రయాణికుల్లో సంతృఫ్తి పెరిగేలా నిర్వహణ ఉండాలని స్పష్టం చేశారు. మరోవైపు బస్సుల కొనుగోలు గురించి కూడా చంద్రబాబు కీలక సూచనలు చేశారు. డీజిల్, ఎలక్ట్రికల్ వెహికల్, సీఎన్‌జీ, బ్యాటరీ స్వైపింగ్.. ఏ బస్సు కొనుగోలు చేసేందుకు, నిర్వహణకు ఎంత ఖర్చు అవుతుందనే ప్రతిపాదనలు రూపొందించాలని చంద్రబాబు సూచించారు.


మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయాలంటే ఏపీఎస్ఆర్టీసీకి మరో 2,536 బస్సులు అదనంగా అవసరం అవుతాయని.. రవాణా శాఖ అధికారులు సీఎంకు వివరించారు. ఇందుకోసం రూ.996 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఏపీ జనాభా 5.25 కోట్లు అయితే.. మహిళలు 2.62 కోట్ల మంది ఉన్నారు. ఇక పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ బస్సుల్లో ఏటా 43.06 కోట్ల సార్లు మహిళలు ప్రయాణిస్తారని అదికారులు అంచనా వేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే ఈ సంఖ్య 75.51 కోట్లకు చేరుతుందని అధికారులు చంద్రబాబుకు వివరించారు.


ఇక ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల విషయానికి వస్తే మహిళల ప్రయాణాల సంఖ్య ఏటా 6.85 కోట్లుగా ఉంది. పథకం అమలు చేస్తే ఈ సంఖ్య 13.39 కోట్లకు చేరుతుందని అధికారులు తెలిపారు. మొత్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే.. ఏడాదిలో 88.90 కోట్ల సార్లు మహిళలు ప్రయాణించే వీలుందని అంచనా. ఈ నేపథ్యంలో ఆక్యుపెన్సీకి తగిన విధంగా బస్సులు సమకూర్చుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa