ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భోపాల్ గ్యాస్ దుర్ఘటన వ్యర్థాల దహనం పూర్తి

national |  Suryaa Desk  | Published : Mon, Jun 30, 2025, 05:12 PM

దేశ చరిత్రలో పెను విషాదాన్ని మిగిల్చిన భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు సంబంధించిన కీలక ప్రక్రియ ముగిసింది. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో దశాబ్దాలుగా పేరుకుపోయిన అత్యంత ప్రమాదకరమైన 337 టన్నుల రసాయన వ్యర్థాలను అధికారులు ఎట్టకేలకు పూర్తిగా దహనం చేశారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఈ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్మూలించడంతో ఆ దుర్ఘటనకు సంబంధించిన ఒక అధ్యాయం ముగిసినట్టయింది.మధ్యప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారి ద్వివేది ఈ వివరాలను వెల్లడించారు. పీథాంపుర్‌లోని ప్రత్యేక డిస్పోజల్ ప్లాంట్‌లో ఈ వ్యర్థాల దహన ప్రక్రియను పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. మార్చి 27న హైకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డుల సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా చేపట్టారు. తొలుత ప్రయోగాత్మకంగా 30 టన్నుల వ్యర్థాలను కాల్చివేయగా, మిగిలిన 307 టన్నులను మే 5 నుంచి జూన్ 30 మధ్య విజయవంతంగా దహనం చేశారు.ఈ వ్యర్థాలను దహనం చేస్తున్న సమయంలో పర్యావరణంపై ఎలాంటి ప్రభావం పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని ద్వివేది స్పష్టం చేశారు. ప్లాంట్ నుంచి వెలువడే వాయువులను, కాలుష్య కణాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ యంత్రాంగం ద్వారా పర్యవేక్షించారు. పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగకుండా నిర్దేశిత పరిమాణంలోనే వ్యర్థాలను కాల్చివేసినట్లు ఆయన వివరించారు.దహన ప్రక్రియ పూర్తయ్యాక మిగిలిపోయిన బూడిద, ఇతర అవశేషాలను అత్యంత సురక్షితంగా ప్రత్యేక సంచుల్లో ప్యాక్ చేసి, లీకులు లేని కంటైనర్లలో ప్లాంట్‌లోని స్టోరేజ్ షెడ్‌కు తరలించారు. ఈ బూడిదను భూమిలో శాశ్వతంగా పాతిపెట్టేందుకు ప్రత్యేకంగా ల్యాండ్‌ఫిల్ సెల్స్ భూగర్భ గదులు నిర్మిస్తున్నామని, నవంబర్ నాటికి నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. ప్రణాళిక ప్రకారం అంతా సజావుగా సాగితే ఈ ఏడాది డిసెంబర్ నాటికి బూడిదను శుద్ధి చేసి ఈ సెల్స్‌లో పాతిపెట్టే ప్రక్రియ కూడా పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.1984 డిసెంబర్ 2వ తేదీ అర్ధరాత్రి భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ కర్మాగారం నుంచి మిథైల్ ఐసోసైనేట్ విషవాయువు లీకైన ఘటనలో అధికారిక లెక్కల ప్రకారం 3,787 మంది మరణించగా, 5 లక్షల మందికి పైగా తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఆ దుర్ఘటన ప్రభావం తరతరాలపై పడిందని, బాధితులు నేటికీ ఆరోగ్య సమస్యలతో పోరాడుతూనే ఉన్నారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa