అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి దీటుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 'క్వాంటం వ్యాలీ'ని ఏర్పాటు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. దీనిని 2026 జనవరి 1 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి ప్రఖ్యాత సంస్థల భాగస్వామ్యంతో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు.విజయవాడలో సోమవారం నిర్వహించిన 'అమరావతి క్వాంటం వ్యాలీ' జాతీయ వర్క్షాప్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన ప్రముఖ బహుళజాతి సంస్థల ప్రతినిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్ టెక్నాలజీకి కేంద్రంగా మార్చాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.ఈ సందర్భంగా తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి అనుభవాలను చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. "నేను తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఐటీ పరిశ్రమ ప్రాముఖ్యతను గుర్తించి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్తో చర్చించాను. పీపీపీ పద్ధతిలో హైదరాబాద్లో హైటెక్ సిటీని నిర్మించాలని ఎల్ అండ్ టీని కోరాను. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు అమరావతిని అధునాతన సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. భవిష్యత్తులో భారత్ అతిపెద్ద ఐటీ హబ్గా మారుతుందని నేను అప్పుడే చెప్పాను" అని వివరించారు.క్వాంటం కంప్యూటింగ్ వల్ల కలిగే ప్రయోజనాలను ముఖ్యమంత్రి వివరిస్తూ, ఇది కేవలం ఒక కంప్యూటర్ను తీసుకురావడమే కాదని, దాని ద్వారా పూర్తిస్థాయి ఎకోసిస్టమ్ను నిర్మిస్తామని అన్నారు. "వ్యవసాయంలో నేల తేమ, ఎరువుల వాడకం వంటి అంశాలను పర్యవేక్షించడానికి, ప్రభుత్వ సేవలను వేగంగా ప్రజలకు అందించడానికి క్వాంటం టెక్నాలజీ ఎంతో అవసరం. ఇప్పటికే ఏపీలో వాట్సప్ ద్వారా ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం. ఆగస్టు 15 నాటికి వంద శాతం సేవలను వాట్సప్ ద్వారానే అందించేలా చర్యలు తీసుకుంటున్నాం" అని తెలిపారు. సీసీ కెమెరాలు, సెన్సార్ల ద్వారా వచ్చే రియల్ టైమ్ డేటాను విశ్లేషించేందుకు ఈ టెక్నాలజీ కీలకం కానుందని చెప్పారు.క్వాంటం టెక్నాలజీ రంగంలో స్టార్టప్లకు అపార అవకాశాలు ఉన్నాయని, ఆవిష్కరణలకు ఆకాశమే హద్దని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి సహా ఐదు ప్రాంతాల్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లను ఏర్పాటు చేస్తున్నామని, యువత వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. బహుళజాతి కంపెనీలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. "పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడానికి టెక్నాలజీయే సరైన మార్గం. హైదరాబాద్లో నిర్మించిన హైటెక్ సిటీ వల్లే నేడు తెలంగాణ ఆదాయంలో 75 శాతం అక్కడి నుంచే వస్తోంది. అమరావతి క్వాంటం వ్యాలీ కూడా దేశానికే మార్గదర్శకంగా నిలవాలి" అని ఆకాంక్షించారు.ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును విజయవంతం చేసే బాధ్యతను ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్కు అప్పగించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అనంతరం మంత్రి లోకేశ్తో కలిసి వర్క్షాప్లో ఏర్పాటు చేసిన క్వాంటం టెక్నాలజీ స్టార్టప్ల స్టాళ్లను పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa