వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చులు పెట్టడం కాదు.. ఏకంగా కట్టుకున్న వాళ్లను కడతేర్చేలా చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. తాజాగా కర్ణాటకలో ఇలాంటి దారుణం వెలుగుచూసింది. ఓ భార్య.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా హతమార్చింది. ప్రియుడి సహాయంతో మృతదేహాన్ని బావిలో పడేసి, భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి నాటకమాడింది.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని తుమకూరు జిల్లా తిపటూరు మండలం కడశెట్టిహళ్లి గ్రామ శివారులోని ఒక ఫామ్ హౌస్లో శంకరమూర్తి (50), సుమంగళ దంపతులు నివాసం ఉంటున్నారు. అదే గ్రామంలోని బాలికల హాస్టల్లో వంట మనిషిగా పనిచేస్తున్న సుమంగళ.. నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ అక్రమ సంబంధం శంకరమూర్తికి తెలిసి, తరచుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. భర్త తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన సుమంగళ, అతడిని అంతమొందించాలని నిర్ణయించుకుంది.
పక్కా ప్లాన్తో హత్య చేశారు..
కుట్రలో భాగంగా, జూన్ 24 రాత్రి శంకరమూర్తి ఇంట్లో ఉన్న సమయంలో సుమంగళ అతడి కళ్లలో కారం కొట్టింది. శంకరమూర్తి బాధతో విలవిల్లాడుతుండగా.. కర్రతో అతడిపై విచక్షణారహితంగా దాడి చేసింది. అంతటితో ఆగకుండా, శంకరమూర్తి గొంతుపై కాలు వేసి బలంగా తొక్కింది. దీంతో శంకరమూర్తి అక్కడికక్కడే మరణించాడు.
మృతదేహం మాయం- పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్
భర్త మరణించాడని నిర్ధారించుకున్న తర్వాత.. సుమంగళ తన ప్రియుడు నాగరాజు సహాయం కోరింది. ఇద్దరూ కలిసి శంకరమూర్తి మృతదేహాన్ని ఒక గోనె సంచిలో కుక్కి, ద్విచక్ర వాహనంపై దాదాపు 30 కిలోమీటర్ల దూరం తీసుకువెళ్లారు. అక్కడ ఉన్న ఒక పొలంలో ఉన్న బావిలో పడేశారు. అనంతరం, భర్త కనిపించడం లేదంటూ సుమంగళి పోలీసులకు ఫిర్యాదు చేసి ఏమీ తెలియనట్లు నటించింది.
అలా చిక్కారు..
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శంకరమూర్తి నివసిస్తున్న ఫామ్ హౌస్ను పరిశీలించగా, అక్కడ కారంపొడి చల్లిన ఆనవాళ్లు కనిపించాయి. దీనిపై అనుమానం వచ్చిన పోలీసులు సుమంగళని తమదైన శైలిలో విచారించారు. మొదట నిందితురాలు బుకాయించినా.. తర్వాత నేరం అంగీకరించింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెప్పింది. సుమంగళ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆమె ప్రియుడు నాగరాజును కూడా అరెస్టు చేశారు. దీనిపై నోనవినకెరె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa