బిహార్లోని గయా జిల్లాలో ఒక జలపాతం వద్ద ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. సరదాగా గడిపేందుకు వెళ్లిన ఆరుగురు మహిళలు ఆకస్మిక వరదలో చిక్కుకుని ప్రాణాల కోసం పోరాడారు. స్థానిక గ్రామస్థులు సమయానికి స్పందించి సాహసోపేతంగా వారిని కాపాడడంతో పెను విషాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.గయా జిల్లాలోని లంగురియా కొండ జలపాతం వద్ద ఆదివారం కొందరు పర్యాటకులు సేద తీరుతున్నారు. వాతావరణం ప్రశాంతంగా ఉండటంతో ఆరుగురు మహిళలు నీటిలో ఆడుకుంటున్నారు. ఇంతలో ఎవరూ ఊహించని విధంగా కొండపై నుంచి నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. క్షణాల్లో జలపాతం ఉగ్రరూపం దాల్చడంతో మిగతా పర్యాటకులు భయంతో బయటకు పరుగులు తీశారు. కానీ, ఈ ఆరుగురు మహిళలు మాత్రం వరద ఉధృతికి జలపాతం మధ్యలోనే చిక్కుకుపోయారు.చుట్టూ వరద నీరు హోరెత్తుతుండగా, ప్రాణభయంతో కేకలు వేస్తున్న మహిళలను గమనించిన స్థానిక గ్రామస్థులు వెంటనే రంగంలోకి దిగారు. తొలుత ఒక మహిళను ఒక రాయి మీదుగా దాటించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అదే ప్రయత్నంలో మరో ముగ్గురు మహిళలు కాలుజారి ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో కొట్టుకుపోయారు. వారు కొద్ది దూరంలో ఉన్న లోయలో పడిపోయేవారు. కానీ, గ్రామస్థులు అతికష్టం మీద వారిని బయటకు లాగారు. మరోవైపున చిక్కుకున్న ఐదో మహిళను కూడా కాపాడారు. చివరగా జలపాతం మధ్యలో ఒంటరిగా మిగిలిపోయిన ఆరో మహిళను కూడా కొద్దిసేపటి తర్వాత సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.ఈ రెస్క్యూ ఆపరేషన్ సమయంలో ఒక మహిళ రాయికి బలంగా తగలడంతో గాయపడింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు అధికారులు తెలిపారు. దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ భయానక దృశ్యాలను అక్కడున్న వారు కెమెరాలో బంధించడం, ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడంతో వైరల్గా మారింది. లంగురియా జలపాతంలో ఇంతటి భీకరమైన నీటి ప్రవాహాన్ని ఎప్పుడూ చూడలేదని గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa