దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు పెట్టుబడులు పెట్టే చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం యథాతథంగా కొనసాగించింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వంటి కీలక పథకాలకు సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు పాత వడ్డీ రేట్లనే వర్తింపజేస్తున్నట్లు ఆర్థిక శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. వడ్డీ రేట్లను మార్చకపోవడం ఇది వరుసగా ఆరో త్రైమాసికం కావడం గమనార్హం.ఇటీవల ఆర్బీఐ రెపో రేటును తగ్గించడం, ప్రభుత్వ బాండ్లపై రాబడి కూడా క్షీణించడంతో ఈసారి చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. అయితే, ఈ ఊహాగానాలకు తెరదించుతూ ప్రస్తుత రేట్లనే స్థిరంగా ఉంచేందుకే ప్రభుత్వం మొగ్గు చూపింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అమల్లో ఉన్న వడ్డీ రేట్లే, జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి కూడా వర్తిస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో స్పష్టం చేసింది.తాజా నిర్ణయం ప్రకారం ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన సుకన్య సమృద్ధి యోజన పథకంపై అత్యధికంగా 8.2 శాతం వడ్డీ కొనసాగుతుంది. అదేవిధంగా పీపీఎఫ్, మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్లపై 7.1 శాతం వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఎన్ఎస్సీ పై వడ్డీ రేటు 7.7 శాతంగా కొనసాగుతుంది.ఇతర పథకాల విషయానికొస్తే, కిసాన్ వికాస్ పత్రపై 7.5 శాతం వడ్డీ 115 నెలల మెచ్యూరిటీ లభిస్తుంది. నెలవారీ ఆదాయ పథకంపై 7.4 శాతం, పోస్టాఫీసు సేవింగ్స్ డిపాజిట్లపై 4 శాతం వడ్డీ రేటులో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా, కేంద్ర ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి ఒకసారి ఈ చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను సమీక్షిస్తుంటుంది. చివరిసారిగా 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఈ రేట్లను సవరించింది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa