ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోన్ కాల్ లీక్ ఎంత పనిచేసింది.. ఏకంగా థాయ్ ప్రధాని పదవి పోయింది

international |  Suryaa Desk  | Published : Tue, Jul 01, 2025, 10:37 PM

థాయ్‌లాండ్‌ యువ ప్రధానమంత్రి పేటోంగ్టార్న్‌ షినవత్రాకు బిగ్ షాక్ తగిలింది. ఆమెను జూలై 1వ తేదీ నుంచి పదవి నుంచి సస్పెండ్ చేస్తూ.. థాయిలాండ్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పొరుగు దేశమైన కంబోడియా మాజీ ప్రధానమంత్రి హున్‌సేన్‌కు ఫోన్ చేసి మాట్లాడగా.. ఆ కాల్ లీక్ కావడంతో ఆమెను పదవి నుంచి సస్పెండ్ చేశారు. అయితే హున్‌సేన్‌తో మాట్లాడిన ఫోన్ కాల్‌లో పేటోంగ్టార్న్ షినవత్రా.. థాయిలాండ్ అంతర్గత పరిస్థితులతోపాటు ఆర్మీ కమాండర్‌పై తీవ్ర ఆరోపణలు చేయడం తీవ్ర వివాదానికి కారణమైంది. థాయిలాండ్ రాజ్యాంగ నిబంధనలను మరీ ముఖ్యంగా మంత్రిత్వ నీతిని ఉల్లంఘించారని కన్జర్వేటివ్ సెనేటర్లు ఆరోపిస్తూ పేటోంగ్టార్న్ షినవత్రాపై కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన రాజ్యాంగ న్యాయస్థానం.. తక్షణమే ఆమెను సస్పెండ్ చేసింది. ఈ కేసులో తుది తీర్పు వచ్చే వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. రాజ్యాంగ ధర్మాసనంలో 7-2 మెజారిటీతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.


థాయ్‌లాండ్‌ పక్కనే ఉన్న కంబోడియా మాజీ ప్రధానిగా 2023 వరకు హున్‌సేన్ ఉన్నారు. హున్‌సేన్ తర్వాత ఆయన కుమారుడు హున్‌ మానెట్ ప్రధాని పదవిలోకి వచ్చారు. హున్‌సేన్‌ ప్రధానమంత్రి పదవిలో లేకపోయినా కంబోడియా రాజకీయాల్లో ప్రభావవంతమైన వ్యక్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవలె హున్‌సేన్‌కు ఫోన్ చేసిన పేటోంగ్టార్న్.. అంకుల్ అంటూ మాట్లాడారు. ఇందులో భాగంగానే థాయిలాండ్‌ రాజకీయ పరిస్థితులను చెప్పారు. ఇదే ఫోన్ కాల్‌లో.. థాయ్‌లాండ్ ఆర్మీ కమాండర్ తనకు వ్యతిరేకంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఈ ఫోన్ కాల్ లీక్ కావడం థాయిలాండ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది.


థాయ్‌లాండ్‌, కంబోడియా దేశాల మధ్య అంత మంచి సంబంధాలేమీ లేవు. పైగా సరిహద్దు వివాదాల కారణంగా గత కొంత కాలంగా ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. మేలో జరిగిన సరిహద్దు ఘర్షణల్లో ఒక కంబోడియా సైనికుడు చనిపోవడం.. రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో హున్‌సెన్‌తో థాయ్‌లాండ్‌ ప్రధాని ఫోన్ కాల్ మాట్లాడటం రాజకీయ దుమారానికి కారణం అయింది.


ఇక ఈ ఫోన్ కాల్ బయటికి రావడంతో థాయిలాండ్ ప్రధాని పేటోంగ్టార్న్‌ షినవత్రాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అధికార కూటమిలోని పార్టీలే ఆమెకు షాకిచ్చాయి. షినవత్రా ఫోన్‌ కాల్‌తో థాయిలాండ్ పరువుతోపాటు.. ఆర్మీ గౌరవం కూడా పోయిందని పేర్కొంటూ.. కూటమి ప్రభుత్వం నుంచి కన్జర్వేటివ్ భూమ్‌జాయ్‌థాయ్‌ పార్టీ బయటకు వచ్చేసింది. రాజ్యాంగ నిబంధనలను ముఖ్యంగా మంత్రులకు అవసరమైన స్పష్టమైన సమగ్రత, నైతిక ప్రమాణాలు పాటించడంలో పేటోంగ్టార్న్ విఫలమయ్యారని పేర్కొంటూ కన్జర్వేటివ్ సెనేటర్ల బృందం ఆమెపై కేసు పెట్టింది. ఈ కేసుపై విచారణ జరిపిన థాయ్‌లాండ్‌ కోర్టు.. ప్రధాని షినవత్రాపై సస్పెన్షన్ వేటు వేసింది.


థాయ్‌లాండ్‌ బిలియనీర్, మాజీ ప్రధానమంత్రి తక్సిన్ షినవత్రా కుమార్తె అయిన పేటోంగ్టార్న్.. గతేడాది ఆగస్ట్‌లో ప్రధాని పదవిలోకి వచ్చారు. 37 ఏళ్లకే ప్రధానమంత్రిగా ఎన్నికైన షినవత్రా.. థాయిలాండ్ దేశ చరిత్రలోనే అతి చిన్న వయసుగల ప్రధానిగా రికార్డుల్లోకి ఎక్కారు. అంతేకాకుండా థాయిలాండ్‌కు రెండో మహిళా ప్రధానిగా చరిత్ర లిఖించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa