ట్రెండింగ్
Epaper    English    தமிழ்

36 వేల అడుగుల నుంచి కిందికి..బోయింగ్ విమానంలో సాంకేతిక లోపం

international |  Suryaa Desk  | Published : Wed, Jul 02, 2025, 10:38 PM

అహ్మదాబాద్ విమాన ప్రమాదం యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, సిబ్బందితో పాటుగా మరి కొందరు బయటి వ్యక్తులు కూడా మరణించారు. ప్రమాదం జరిగి సుమారు నెల రోజులు కావొస్తున్నా.. జనాలు ఇంకా ఆ భయం నుంచి బయటపడలేదు. పైగా విమానయానం అంటేనే భయంతో వణికిపోతున్నారు. అదలా ఉంచితే అహ్మదాబాద్ విమాన ప్రమాదం చోటు చేసుకున్న నాటి నుంచి నేటి వరకు విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తి.. వాటిని అర్ధాంతరంగా ల్యాండ్ చేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో భయానక ఘటన వెలుగు చూసింది. సుమారు 36 వేల అడుగుల ఎత్తు నుంచి అకస్మాత్తుగా కిందకు దిగింది. దీంతో ప్రయాణికులు భయంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఆ వివరాలు..


ఈ సంఘటన రెండు రోజుల క్రితం అనగా జూన్ 2న చైనా, షాంగై నుంచి జపాన్ , టోక్యో వెళ్తున్న జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం (జెఎల్8696) బోయింగ్ 737లో సాంకేతిక లోపం తలెత్తడంతో.. సుమారు 36 వేల అడుగుల ఎత్తు నుంచి కిందకు దిగింది. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా భయపడ్డారు. విమానం కూలిపోతుందని భావించిన ప్రయాణికులు తమ ఆస్తిపాస్తులు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, విల్లులకు సంబంధించిన సమాచారాన్ని తమ కుటుంబ సభ్యులకు మెసేజ్ చేశారు.


అయితే పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా.. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈ విమానం జూన్ 30న షాంగై పుడోంగ్ విమానాశ్రయం నుంచి టోక్యో నరితా ఎయిర్‌పోర్టుకు బయలుదేరింది. ఈ విమానం జపాన్ ఎయిర్‌లైన్స్, దాని అనుబంధ సంస్థ స్ప్రింగ్ జపాన్ మధ్య కోడ్‌షేర్ ఒప్పందం ప్రకారం నడుస్తుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, సంఘటన చోటు చేసుకున్న సమయంలో విమానంలో 191 మంది ఉన్నారు.


ప్రెస్ నివేదిక ప్రకారం.. విమానం రోజు వారి రోటిన్‌లో ప్రయాణం మొదలుపెట్టింది. అయితే గాల్లోకి ఎగిరిన కాసేపటి తర్వాత అనగా సాయంత్రం 6.53 గంటల సమయంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం ఉన్నట్లుండి 36 వేల అడుగుల ఎత్తు నుంచి 10,500 అడుగుల కిందకు దిగింది. అది కూడా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే. ప్రమాదాన్ని గుర్తించిన పైలెట్ వెంటనే అప్రమత్తపై ఒసాకా, కన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పరిస్థితి గురించి సమాచారం అందించాడు.


విమానం కిందకు దిగుతున్న సమయంలో క్యాబిన్ ఒత్తిడి తగ్గడంతో, ఆక్సిజన్ మాస్క్‌లు అందించారు. ఫ్లైట్ అటెండెంట్ సూచనలు చేస్తుండగా.. ప్రయాణికులు ఆక్సిజన్ మాస్క్‌లు ధరించి ప్రాణాలు అర చేతిలో పట్టుకుని.. బిక్కుబిక్కుమంటూ కూర్చోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.


భయాందోళనల నడుమ రాత్రి 8:50 గంటలకు విమానం ఒసాకాలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులకు విమానాశ్రయంలో వసతి కల్పించిన సిబ్బంది.. ఆ తర్వాత వారిని వేరే విమానాల్లో వారి వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు అధికారులు వెల్లడించారు. సాంకేతిక లోపం తలెత్తడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa