ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రిటన్ వీసా నిబంధనలు కఠినతరం.. భారతీయులకు తిప్పలు

international |  Suryaa Desk  | Published : Wed, Jul 02, 2025, 11:05 PM

చాలా మంది భారతీయులు ఉపాధి నిమిత్తం అమెరికా, బ్రిటన్, జర్మనీ సహా పలు దేశాలకు వెళ్తుంటారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు మాత్రమే కాక.. పలు రకాల సేవలు అందించడం కోసం కూడా విదేశాలకు వెళ్తుంటారు. ఈక్రమంలో బ్రిటన్ ప్రభుత్వం విదేశీ వలసదారులకు భారీ షాక్ ఇచ్చింది. వేర్వేరు దేశాల నుంచి ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం బ్రిటన్ వచ్చే వారికి సంబంధించిన వీసా నిబంధనలను కఠినతరం చేసేందుకు రెడీ అయ్యింది. ఈ విషయంలో బ్రిటన్ కూడా అమెరికా బాటలోనే నడుస్తుంది. దీనిలో భాగంగా విదేశీ నిపుణుల వీసా నిబంధనలను కఠినతరం చేసే బిల్లును బ్రిటన్ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది.


ఈ కొత్త నిబంధనల ద్వారా వలసలను తగ్గించి, బ్రిటన్ పౌరులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జులై 22 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. వీసా నిబంధనలు కఠినతరం చేయడం చాలా మంది భారతీయులపై ప్రభావం చూపుతుంది అంటున్నారు. అయితే బ్రిటన్ వలస విధానాన్ని పూర్తిగా మార్చేందుకే ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చామని హోం మంత్రి యెవెట్‌ కూపర్ తెలిపారు. వలసలను క్రమబద్ధీకరించి, తమ పౌరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించుకునేందుకే ఈ నిబంధనలు అని ఆమె తెలిపారు. గత ప్రభుత్వం వలసలను ప్రోత్సహించడంతో నాలుగేళ్లలోనే అవి నాలుగు రెట్లు పెరిగాయని ఆమె విమర్శించారు.


ఈ సందర్భంగా కూపర్ మాట్లాడుతూ.. ‘మా ప్రభుత్వం వలస విధానాన్ని క్రమబద్ధీకరించి, నియంత్రణలోకి తీసుకొస్తుంది. బ్రిటన్ పౌరులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, విదేశీ వలసలను తగ్గిస్తాము. ఉద్యోగుల నైపుణ్యాలకు విలువ ఇస్తాము, వారిని శ్రమ దోపిడీకి గురి కాకుండా చూస్తామ’ని కూపర్ స్పష్టం చేశారు. అలానే బ్రిటన్‌కు వచ్చే విదేశీయులు సరైన రీతిలో వచ్చి సేవలు అందించేలా చూస్తామని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు.


ఈ ఏడాది మే నెలలో బ్రిటన్ ప్రభుత్వం కొత్త వీసా నిబంధనల గురించి ఒక శ్వేతపత్రం విడుదల చేసింది. ఇప్పుడు వాటిని చట్టంగా మార్చేందుకు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. పార్లమెంటు ఆమోదం తర్వాత జులై 22 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. దీని ప్రభావం భారతీయులపై ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది భారతీయులు పర్సనల్ కేర్ సెంటర్లు, హోటళ్లు, నిర్మాణ సంస్థలు, ఆసుపత్రుల్లో తక్కువ స్థాయి ఉద్యోగాల కోసం బ్రిటన్ వెళ్తుంటారు.


కొత్త నిబంధనల ప్రకారం, బ్రిటన్‌లో ఉద్యోగం చేయాలంటే విదేశీ నిపుణులకు ఎక్కువ నైపుణ్యాలు ఉండాలి. తక్కువ జీతం వచ్చే ఉద్యోగాలను విదేశీయులతో భర్తీ చేయకూడదు. ఇంటి పనులు, పర్సనల్ కేర్, వృద్ధులు, పిల్లలు, దివ్యాంగులకు సేవ చేసే పనులకు విదేశీయులను తీసుకోకూడదు. గతంలో వంట మనుషులు, ప్లాస్టరింగ్ చేసేవారు వంటి 100 రకాలకు పైగా పనులకు వీసా మినహాయింపు ఉండేది. ఇకపై ఆ మినహాయింపు ఉండదు.


అయితే, ఇప్పటికే యూకేలో పని చేస్తున్న విదేశీయులకు కొన్ని మినహాయింపులు ఉంటాయని హోంశాఖ సహాయ మంత్రి సీమా మల్హోత్రా తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం, జులై 22 నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా సమానమైన విద్యార్హత ఉన్నవారికే బ్రిటన్ వీసా వస్తుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa